
కొనుగోళ్లలో జాప్యం
ములుగు రూరల్: యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడం, అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. జిల్లాలో యాసంగి పంటల సాగు డిసెంబర్, జనవరి మాసాలలో సాగు చేయగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి వరి కోతలు మొదలయ్యాయి. కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు తేమశాతం వచ్చే సమయానికి అకాల వర్షాలు పడుతుండడంతో ధాన్యం తేమశాతం పెరుగుతుండడంతో కాంటాలు ఆలస్యం అవుతున్నాయి. దీనికి తోడు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యాసంగి ధాన్యం దిగుమతులను నిరాకరించడంతో కొంతమేర జాప్యం జరిగింది. సివిల్ సప్లయీస్ అధికారులు, కలెక్టర్ చొరవతో వరంగల్, హనుమకొండ మిల్లులను కేటాయించి అలాట్మెంట్ చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి మిల్లర్స్ అసోసియేషన్ దిగివచ్చి కోతలు లేకుండా ధాన్యం దిగుమతులు చేసుకుంటామని ఒప్పదం చేసుకున్నారు.
తేమశాతం రాక ఇబ్బందులు
యాసంగి కోతలు మొదలైన దగ్గర నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరి కోతలు చేపట్టి ధాన్యం ఆరబోస్తే అకాల వర్షాలకు రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం తేమశాతం వచ్చే సమయానికి వర్షాలు పడడంతో రైతులు ధాన్యం తిరిగి ఆరబోయాల్సి వస్తుంది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
92,113 మెట్రిక్ టన్నుల లక్ష్యం
జిల్లాలోని పది మండలాల్లో మొత్తం యాసంగి సాగులో సివిల్ సప్లయీస్ అధికారులు 92,113 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 12వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లాలో 153 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పీఏసీఎస్, జీసీసీ, ఐకేపీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు.
జిల్లాలో 153 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
92,113 మెట్రిక్ టన్నుల
సేకరణే లక్ష్యం
ఇప్పటికి కొనుగోలు చేసింది
12 వేల మెట్రిక్ టన్నులు
అకాల వర్షాలతో తేమశాతం
రాక రైతుల ఇబ్బందులు