
కోలాహలంగా బీరమయ్య జాతర
వాజేడు: మండుటెండల్లో తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్ట గండి వద్ద కొండలపైన గిరిజనుల ఆరాధ్య దైవమైన బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర కోలాహలంగా ప్రారంభమైంది. శనివారం రాత్రి నుంచి ప్రారంభమైన ఈ జాతరకు భక్తజనం భారీగా తరలివచ్చింది. సరిహద్దు గుట్టల నడుమ ఆకులు లేని ఎతైన చెట్లు ఒక పక్క హొయలొలికిస్తున్న గోదావరి నది మరో పక్కన ఉన్నాయి. సుమారుగా 4 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు గుండా గుట్టపైకి చేరుకున్న వెంటనే భక్తులు హర హర (భీరమయ్య) అంటూ పులకించి పోయారు.
కొలువుదీరిన దేవరలు
మండల పరిధిలోని కడేకల్ గ్రామం నుంచి లక్ష్మీదేవర, పెద్ద గంగారం నుంచి సారలమ్మ, టేకుల గూడెం నుంచి ముత్యాలమ్మ, పోషమ్మ దేవరను పూజారులు, గిరిజనులు వారి ఆచార, సాంప్రదాయాల ప్రకారం శనివారం సాయంత్రం గుట్టకు చేర్చి ప్రతిష్టించారు. ఈ జాతరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నేడు బీరమయ్య–రేఖలమ్మ కల్యాణం జరగనుంది. ఆదివారం ఉదయం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు.
గద్దెలకు చేరిన సారలమ్మ,
ముత్యాలమ్మ, పోషమ్మ, లక్ష్మీదేవర
భారీగా తరలివచ్చిన భక్తులు

కోలాహలంగా బీరమయ్య జాతర