దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి

Mar 25 2025 1:45 AM | Updated on Mar 25 2025 1:40 AM

ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో 42 దరఖాస్తులు

ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని కారుపాటు పౌర్ణమి. దివ్యాంగురాలు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన సారయ్య కుమార్తె. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తల్లి చనిపోవడంతో నానమ్మ, తండ్రి బాగోగులు చూసుకుంటున్నారు. గతంలో చేసిన అభ్యర్థన మేరకు అధికారులు బ్యాటరీ ట్రైసైకిల్‌ అందించారు. అయితే గత కొన్ని నెలల క్రితం అది మరమ్మతులకు గురైంది. ఇంటి నుంచి పాఠశాల కిలోమీటర్‌ ఉండడంతో రోజువారీగా వెళ్లే వీలులేక చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఉపాధ్యాయులు ఇంటికి వచ్చిన సమయంలో ఇదే విషయం చెప్పారు. దీంతో గ్రామస్తుల సూచన మేరకు గ్రీవెన్స్‌ సెల్‌లో మరో బ్యాటరీ ట్రైసైకిల్‌ ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.

పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సిఫారసు

స్వీకరించిన అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, పీఓ చిత్రామిశ్రా

ములుగు/ఏటూరునాగారం:కలెక్టరేట్‌, ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో పలు రకాల సమస్యలపై దరఖాస్తులు అందించిన ప్రజలు పరిష్కారం చూపాలని అధికారులను వేడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో 27దరఖాస్తులు రాగా వాటిని అదనపు కలెక్టర్లు పరిశీలించి ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్‌ చేశారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరించారు. గిరిజన దర్బార్‌లో 15 వినతులు రాగా పరిశీలించిన పీఓ తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్‌ చేశారు. వినతుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆదేశించారు.

ప్రజావాణి దరఖాస్తుల వివరాలు

భూ సమస్యలు పరిష్కరించాలని ఎనిమిది, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఒకరు, పింఛన్‌ అందించాలని ఒకరు, బ్యాటరీ ట్రైసైకిల్‌ అందించాలని ఒకరు, బ్యాంకు రుణం అందించాలని ఒకరు ఇలా పలు రకాల సమస్యలపై 27 వినతులు సమర్పించారు.

గిరిజన దర్బార్‌లో..

● వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన పాయం రాందాస్‌ పెట్రోల్‌ బంక్‌ మంజూరు చేయాలని వేడుకున్నారు.

● గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన బానోతు గోపిచంద్‌ వ్యవసాయ భూమిలో బోరు వేయించి మోటారు ఇప్పించాలని కోరారు.

● వెంకటాపురం(కె) మండలంలోని ఎదిర పీహెచ్‌సీలో కాంటింజెంట్‌ వర్కర్‌గా ఇప్పించాలని అదే ప్రాంతానికి చెందిన దీపిక పీఓకు మొరపెట్టుకున్నారు. అలాగే సాయిలక్ష్మి ఎదిర పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సు పోస్టు ఇప్పించాలని విన్నవించారు.

● కన్నాయిగూడెం మండలం గంగుగూడెం ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మించాలని పొడెం బాబు వినతిపత్రాన్ని అందజేశారు. అదే మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఇర్ప కృష్ణారావు మూడు ఎకరాల్లో వరిపంట నీళ్లు లేక ఎండిపోతుందని.. బోరు వేయించి నీరు అందించాలని విన్నవించారు.

● ఐటీడీఏ గిరిజన భవనం నిర్వహణ కోసం వట్టం నర్సింహరావును నియమించాలని పీఓను పొడెం బాబు కోరారు.

● ఏటూరునాగారం మండలం రాయిబంధం ప్రాంతానికి చెందిన పద్దం జోగయ్య ఇందిర జలప్రభ కింద బోరు వేసి స్తంభాలు వేశారు కానీ విద్యుత్‌ తీగలు అమర్చి విద్యుత్‌ సరఫరా చేయాలని వేడుకున్నారు. అలాగే చిన్నబోయినపల్లి ప్రాంతానికి చెందిన పద్దం పొజ్జయ్య తన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా భూములను నీలమ్మ పేరుపైకి అక్రమంగా మార్చిన అటవీశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

● భూపాలపల్లి జిల్లాలోని పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌లో ఖాళీగా ఉన్న ఎంపీహెచ్‌డబ్ల్యూ పోస్టు ఇప్పించాలని అదే ప్రాంతానికి చెందిన జయప్రద వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే మహబూబాబాద్‌ స్కూల్‌(ఏహెచ్‌ఎస్‌) స్కూల్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ ఇప్పించాలని సుగుణ విన్నవించారు.

సిబిల్‌ స్కోర్‌ లేదని

లోన్‌ ఇవ్వడం లేదు..

గ్రామంలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఇటీవల పీఎం విశ్వకర్మ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే రూ.లక్ష రుణం మంజూరు అయ్యింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నాకు ఖాతా ఉంది. ఆదాయం ఎక్కువగా లేకపోవడంతో లావాదేవీలు జరగలేదు. దీంతో సిబిల్‌ స్కోర్‌ లేదని బ్యాంకు మేనేజర్‌ రుణం ఆపివేశారు. అధికారులు నాకు లోన్‌ ఇప్పించి ఆదుకోవాలి.

– ఎనగందుల సతీశ్‌,

చింతకుంట, ములుగు

మనువరాలు 27గుంటల భూమిని పట్టా చేయించుకుంది..

నాకు ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కుమారుడు శంకర్‌ కుమార్తె నా మనుమరాలు రాధిక నా పేరు మీద ఉన్న 27గుంటల వ్యవసాయ భూమిని పట్టా చేయించుకుంది. రైతుబంధు కూడా తానే తీసుకుంటుంది. ఈ విషయాన్ని పెద్దమనుషుల సమక్షంలో అడిగించగా నా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నా కూతురు దొంగరి స్వరూప నాకు ఇళ్లు కట్టించి బాగోగులు చూసుకుంటుంది. నా భూమి నాకు ఇప్పించి న్యాయం చేయాలి.

–వంగరి నర్సమ్మ,

నర్సాపూర్‌, వెంకటాపురం(ఎం)

దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి1
1/4

దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి

దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి2
2/4

దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి

దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి3
3/4

దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి

దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి4
4/4

దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement