
గిరిజన యూనివర్సిటీకి మంచిరోజులు వచ్చేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ :
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్సీటీయూ)కి మంచిరోజులు వచ్చినట్లేనా? యూనివర్సిటీని ప్రారంభించిన సుమారు ఏడాదిలో తొలి వైస్ చాన్స్లర్ను నియమించడం ద్వారా ప్రభుత్వాలు దృష్టి సారించినట్లేనా? అంటే అవుననే అంటున్నారు అధికారులు. 2023 అక్టోబర్లో ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. 500 ఎకరాల స్థలం కేటాయింపు.. రూ.900 కోట్లను ప్రకటించినా.. ఆ మేరకు హెచ్ఓడీలు, అధ్యాపకులు, మౌలిక వసతులు లేక విద్యార్థులు అడ్మిషన్ తీసుకోలేదు. తరగతులు 2024–25 నుంచే ప్రారంభింభినా స్పాట్ అడిషన్ల తర్వాత కేవలం 14 మంది చేరగా.. జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో తాత్కాలిక తరగతులు నిర్వహిస్తున్నారు.
పదేళ్ల కల సాకారమైన..
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా పదేళ్ల కల సాకారమైన ఆ మేరకు తరగతుల నిర్వహణ లేకపోవడం ఇంతకాలంగా వెలితిగా కనిపిస్తోంది. యూనివర్సిటీ మంజూరు, ప్రారంభం సమయంలో రూ.900 కోట్లు, 500 ఎకరాల స్థల కేటాయింపులపై ఇంకా సందిగ్ధతే ఉంది. 2018 జనవరి 4వ తేదీన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)తో కూడిన ప్రణాళికతో పాటు ఉన్న స్థలంలోనే తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి నివేదికను అప్పగించింది. సంప్రదించిన హెచ్సీయూ 2019వ సంవత్సరం 19వ తేదీన రాష్ట్ర ఉన్నత విద్యామండలిని కోరింది. ఇందుకుగాను ములుగు మండలంలోని అడ్మినిస్ట్రేషన్ నిర్వహణకు యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో 10 రకాల కోర్సులతో ఒక్కో కోర్సులో 20 మందితో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. తరగతులు ప్రారంభించడానికి కనీసం 50 ఎకరాల స్థలంలో నిర్మాణం ఉండాలన్న ఆంక్షలతో పక్కనపెట్టినా.. ఎట్టకేలకు మహబూబ్నగర్ సభలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని మంజూరు చేస్తూ రూ.900 కోట్లను ప్రకటించారు. పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉండటంతో భవన నిర్మాణాలు లేక, వైటీసీలోనే తాత్కాలికంగా 14 మందితో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి.
వైస్ చాన్స్లర్ నియామకంతో కదలిక.. సర్వత్రా హర్షం...
ఎట్టకేలకు సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్సీటీయూ) తొలి వీసీ నియామకం జరగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తొలి వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున డిప్యూటీ సెక్రటరీ శ్రేయ భరద్వాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వైఎల్ శ్రీనివాస్ అరోరా యూనివర్సిటీ వీసీగా పని చేస్తుండగా.. ఆయన నియామకంతో ట్రైబల్ యూనివర్సిటీ పురోగతికి ముందడుగు పడినట్లేనన్న చర్చ జరుగుతోంది. కాగా 2024–25 విద్యాసంవత్సరానికి బీఏ(హానర్స్) ఇంగ్లిష్, బీఏ (హానర్స్) ఎకనామిక్స్లలో 47 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కేవలం ముగ్గురే అడ్మిషన్లకు ముందుకు రావడంతో తేదీని పొడిగించి 2024 అక్టోబర్ 3న స్పాట్ సెలక్షన్ ద్వారా మరో 9 మందిని చేర్చుకోగా 14కు చేరింది. బీఏ ఎకనామిక్స్లో ఐదుగురు, బీఏ ఇంగ్లిష్లో 9 మందికి క్లాసులు నిర్వహిస్తున్నారు. తొలి అడ్మిషన్లు అలాగే ఉంటాయని, వచ్చే సంవత్సరం నుంచి అడ్మిషన్లు పెరుగుతాయని అధికారులు చెబుతుండగా.. ఇదే సమయంలో వైస్ ఛాన్స్లర్గా వైఎల్ శ్రీనివాస్ను నియమించడంతో యూనివర్సిటీకి మంచిరోజులు వస్తాయన్న చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రెండు కోర్సులే.. అడ్మిషన్ తీసుకున్నది 14 మంది
యూత్ ట్రైనింగ్ సెంటర్లో
తరగతుల నిర్వహణ
ఎట్టకేలకు తొలి వైస్చాన్స్లర్
నియామకం..
ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్కు వీసీగా బాధ్యతలు.. వీసీ నియామకంపై హర్షం

గిరిజన యూనివర్సిటీకి మంచిరోజులు వచ్చేనా?