ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)
ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.
'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.
దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.
(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


