సినిమా అనే ప్రపంచంలో ఎప్పుడూ రేసు కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎలాంటి కథలతో చిత్రాలు చేసినా అంతిమ లక్ష్యం విజయం సాధించడమే. తద్వారా ఆర్థికపరమైన లాభాలు ప్రధానాంశంగా మారతాయి. సినిమా శతాబ్ది వేడుకను జరుపుకున్నా ఇప్పటికీ ఈ ఫార్ములాలో ఎలాంటి మార్పులేదు. ఉండదు కూడా. వైవిధ్యం అనేది దర్శకుడి సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రేక్షకులు మోనాటమిని అసలు ఇష్టపడడం లేదు. అది ఏ సూపర్స్టార్ హీరోగా నటించినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలకు గడ్డుకాలం ఏర్పడింది.
ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయన్, కూలీ మూవీతో పాటు కమలహాసన్ నటించిన థగ్ లైఫ్, విజయ్ నటించిన లియో, గోట్, అజిత్ నటించిన విడాముయర్చి , సూర్య నటించిన రెట్రో, కంగువ వంటి చిత్రాలే. అదేవిధంగా జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవన్నది జగమెరిగిన సత్యం. సినిమా, జయాపజయాలు అన్నవి నిరంత ప్రక్రియ. అయితే, ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్లు చతికిలపడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోలు, కొత్త దర్శకులు దూకుడు చూపుతున్నారు. వారు చేసిన చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఆదరణ లభిస్తుంది. పెద్ద హీరోల సినిమాలకు ప్రచారం ఎక్కువ. కానీ, కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్లో ఉండటం లేదు.
సినియర్ నటి సిమ్రాన్ కుడా ప్రస్తుతం సినిమాల విషయంలో జరుగుతున్న ఫాల్స్ ప్రచారాన్ని ఎండగట్టారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ, డ్రాగన్, 3బీహెచ్కే వంటి చిత్రాలు మంచి ప్రశంసలు అందుకొవడంతో పాటు , రెండు వారాలు దాటిన తరువాత కూడా థియేటర్లకు వెళ్లినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. అయితే పెద్ద పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలే పలు కోట్ల రూపాయలు వసూళ్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల మోత మోగుతోందన్నారు. అయితే అలాంటి చిత్రాలు విడుదలైన వారం తరువాత వెళితే థియేటర్లలో ప్రేక్షకులే ఉండడం లేదన్నారు. అయినప్పటికీ అంత వసూలు, ఇంత వసూలు అని ఎందుకు ప్రచారం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని సిమ్రాన్ పేర్కొన్నారు.


