
సెలబ్రిటీలు ఏం మాట్లాడాలన్నా, ఎలాంటి పోస్టులు వేయాలన్నా కాస్త ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం. గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) ఇప్పుడలాంటి పరిస్థితిలో ఇరుక్కుంది. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయిన సంగతి తెలిసిందే! మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన అతడి పేరు విశ్వాస్ కుమార్ రమేశ్. చిన్నపాటి గాయాలతో సంఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు.
అతడు చెప్పేది అబద్ధం
అతడి గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. విశ్వాస్ అబద్ధం చెప్తున్నాడని కొందరు పుకార్లు సృష్టించారు. అది నిజమని నమ్మిన సుచిత్రా కృష్ణమూర్తి ఆ రూమర్స్ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రమేశ్ అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అదేగనక నిజమైతే అతడికి కఠిన శిక్ష విధించాలి. లేదంటే పిచ్చి ఆస్పత్రిలో వేయాలి అని ట్వీట్ చేసింది.
ట్వీట్ డిలీట్
ఇది చూసిన నెటిజన్లు అసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తున్నావని విమర్శించారు. ఆయన విమాన ప్రమాదంలోని బాధితుడే అని అహ్మదాబాద్లోని ఆస్పత్రి అధికారులే ధృవీకరించాక ఇంకేంటి సమస్య? అని ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న సుచిత్ర.. వెంటనే సదరు ట్వీట్ను డిలీట్ చేసింది. తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా దాన్ని పోస్ట్ చేసినందుకు సారీ అని ట్వీట్ చేసింది.
నటిగా..
గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్బాత్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్లోనూ నటించింది. 1999లో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన దర్శకుడు శేఖర్కపూర్ను వివాహమాడింది. వీరికి కావేరీ అనే కూతురు జన్మించింది. 2007లో సుచిత్రా- శేఖర్ విడాకులు తీసుకున్నారు.
Took out my last tweet on the air india crash survivor. Seems to be false news circulated for God knows what reason. My apologies
— Suchitra Krishnamoorthi (@suchitrak) June 19, 2025
చదవండి: ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా!