
చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించనున్నట్లు ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ చిత్రబృందం ప్రకటించింది. ముకుంద్ పాండే కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో అభయ్ చరణ్ ఫౌండేషన్–శ్రీజీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ టైటిల్ను ప్రకటించారు. ‘‘ఇస్కాన్–ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ ‘జితామిత్ర ప్రభు శ్రీ’ ఆశీస్సులతో ఈ చిత్రం రూపొందుతోంది.
11–12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించేలా ఈ సినిమా ఉంటుంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను కలగలుపుతుంది. నటీనటులు, సాంకేతిక బృందంతో పాటు పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: అనిల్ వ్యాస్.