హీరోలు కమల్హాసన్ , రజనీకాంత్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కమల్తో కలిసి సినిమా చేస్తున్నట్లు రజనీ కూడా ఖరారు చేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి చేయనున్న ఈ మల్టీస్టారర్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తొలుత దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఆ తర్వాత మరికొందరి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.
తాజాగా ఈ చిత్రానికి కమల్హాసన్ దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్తో పాటు తాను నటిస్తున్న చిత్రం కనుక క్యారెక్టరైజేషన్స్ , పాత్రల నడివి, సన్నివేశాలు.. వంటి అంశాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమల్ భావిస్తున్నారట. ఇందుకోసం తానే దర్శకుడిగా రంగంలోకి దిగాలని కమల్ ఆలోచన అని కోలీవుడ్ భోగట్టా.
ఈ చిత్రాన్ని కమల్హాసన్ తో కలిసి ఉదయనిధి స్టాలిన్ నిర్మించనున్నారనే టాక్ గతంలో తెరపైకి వచ్చింది. కానీ, తాజాగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, కమల్హాసన్ కుమార్తె శ్రుతీహాసన్ నిర్మించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రచారంలో ఉన్నట్లు ఈ విషయాలపై స్పష్టమైన సమాచారం రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.


