స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశమొస్తే ఏ దర్శకనిర్మాత వదులుకోడు. దీన్ని ఉపయోగించి స్టార్డమ్ సొంతం చేసుకోవాలని అనుకుంటారు. కానీ తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి మాత్రం కమల్-రజనీ సినిమా నుంచి తప్పుకొన్నాడు. గతేడాది నవంబరులో ఇది జరిగింది. తొలుత ఇతడినే డైరెక్టర్ అని ఘనంగా ప్రకటించారు. కట్ చేస్తే కొన్నిరోజులకే సదరు ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. ఇన్నాళ్లకు అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: 'టాలీవుడ్లో కుల పిచ్చి ఎక్కువ'.. కమెడియన్ మహేశ్)
'నిజం చెప్పాలంటే ఆ సినిమా చేయడానికి సిద్ధమవగానే చాలా ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా, ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీస్తూ సినిమాలు చేశాను. కానీ రజనీ సినిమాని డీల్ చేసే కెపాసిటీ నాకు లేదనిపించింది. ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే క్రమంలో నా ఆలోచనలని ఇతరులకు ఒప్పించే సామర్థ్యం నాకు లేదనిపించింది. నాకు స్టోరీ సరిగా చెప్పడం రాదు. అదే టైంలో ఎవరైనా మార్పులు చెబితే ఎదురుతిరగకుండా ఓకే చెప్పేస్తాను'
'ఇలాంటి పెద్ద సినిమా చేస్తే అందులో నా ఒక్కడి నిర్ణయమే ఉండదు. సినిమాకు, ఆ ఇద్దరు లెజెండ్స్కి నేను పూర్తిగా న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే ప్రారంభంలోనే సినిమా నుంచి తప్పుకొన్నా. రజనీ-కమల్తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో నాకు కోరిక ఉంది. వారితో గడిపిన కొన్నిరోజుల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ అది నా జీవితంలో తీసుకున్న కష్టమైన నిర్ణయం. ఇలా చేయడానికి ముందే స్వయంగా రజనీకాంత్ని కలిసి విషయం చెప్పాను' అని సుందర్.సి వివరణ ఇచ్చాడు.
గతంలో రజనీకాంత్తో 'అరుణాచలం', కమల్ హాసన్తో 'సత్యం శివం' సినిమాలు చేసిన సుందర్.సి.. తర్వాత నుంచి మాత్రం హారర్, మిడ్ రేంజ్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. గత నెలలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ప్రస్తుతం నయనతార లీడ్ రోల్లో 'ముకుతి అమ్మన్ 2' అనే మూవీ చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)


