ఈ ఏడాది కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను ప్రకాశ్ రాజ్ నేతృత్వంలోని జ్యూరీ ఎంపిక చేసింది. 2024కు గానూ ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ నిలవడంతో పాటు ఏకంగా 9 విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
అయితే ఈ అవార్డుల ప్రకటనపై మలయాళ చైల్డ్ ఆర్టిస్ట్ విమర్శలు చేసింది. మలికాపురం, గు లాంటి చిత్రాల్లో తన పాత్రలకు పేరు తెచ్చుకున్న బాలనటి దేనానంద జిబిన్ సోషల్ మీడియాలో జ్యూరీని విమర్శించింది. ఈ అవార్డుల్లో బాల నటులను విస్మరించడంపై తన ఆవేదన వ్యక్తం చేసింది. తాను మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు నిర్వహించే దేవా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. పిల్లలకు అవార్డులకు ప్రకటించేందుకు జ్యూరీ సభ్యులకు కళ్లు మూసుకుపోయానని రాసుకొచ్చారు.
దేవానంద తన ఇన్స్టాలో రాస్తూ.. 'మీ కళ్లతో పిల్లల్ని దగ్గరగా చూడండి. అంతే కానీ ఇక్కడంతా చీకటిగా ఉందని మాత్రం చెప్పకండి. పిల్లలు కూడా ఈ సమాజంలో భాగమే. రాబోయే తరానికి 2024 మలయాళ చలనచిత్ర అవార్డులను ప్రకటించడంలో జ్యూరీకి కళ్లు మూసుకుపోయాయి. స్టానర్తి శ్రీకుట్టన్, గు, ఫీనిక్స్, ఏఆర్ఎం లాంటి సినిమాల్లో పిల్లలు నటించారు. ఇద్దరు పిల్లలకు అవార్డులు ఇవ్వకుండా కూర్చోవడం కాదు.. మరిన్ని పిల్లల సినిమాలు చేయాలని చెప్పడానికి ప్రయత్నించండి. కనీసం ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లకైనా అవార్డ్స్ ఇచ్చి ఉంటే.. అది ఎంతో మంది నా లాంటి పిల్లలకు ప్రోత్సాహంగా ఉండేది. పిల్లలకు మరిన్ని అవకాశాలు రావాలని.. వారు కూడా సమాజంలో భాగమేనని జ్యూరీ చైర్మన్ చెప్పడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నా. అన్ని మీడియా, చిత్రనిర్మాతలు, సాధారణ ప్రజలు కూడా దీని గురించి చర్చించాలి. మా హక్కులను పెట్టుబడి పెట్టడం కాదు.. మార్పులు జరగాలి. మార్పులతో పాటు పిల్లల హక్కులను కూడా కాపాడుకోవాలి' అంటూ పోస్ట్ చేశారు.
దీంతో ప్రస్తుతం ఈ విషయం మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డుల ప్రకటన అనంతరం నటుడు ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఇందులో ఆయన పిల్లల విభాగం అవార్డులపై కామెంట్స్ చేశారు. ఆ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేవానంద విమర్శించింది.
ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?
ఉత్తమ బాలల చిత్ర విభాగానికి ఆరు సినిమాలు వచ్చినప్పటికీ.. ఏవీ కూడా ప్రమాణాలకు అనుగుణంగా లేవని జ్యూరీ నిర్ణయించిందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఇది ఈ సినిమాల నటులకు కూడా వర్తిస్తుందని అన్నారు. చిన్న పిల్లల విభాగంలో మనకు ఒక్క బెస్ట్ సినిమా కూడా కనిపించలేదు.. అంతేకాకుండా పిల్లలతో సినిమా తీసే ప్రయత్నం కూడా జరగలేదని వెల్లడించారు. సినిమాలు అంటే కేవలం పెద్దలు, యువకులు మాత్రమే కాదు.. పిల్లలు కూడా సమాజంలో భాగమని దర్శకులు, రచయితలు గ్రహించాలని ప్రకాశ్ రాజ్ సూచించారు. పిల్లలు ఏమి ఆలోచిస్తారో మనం తెలుసుకోవాలన్నారు. ఏ సినిమా కూడా పిల్లల అవగాహన గురించి మాట్లాడదని అన్నారు. దీంతో బాల నటులపై ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు వినేష్ విశ్వనాథ్, మరో నటుడు ఆనంద్ మన్మధన్ కూడా జ్యూరీ విధానాన్ని ప్రశ్నించారు.


