ఓటీటీ యాప్ను తీసుకువచ్చే ప్లాన్లో నాగ్!
సినిమా తీయడంలోనే కాదు, చూడటంలోనూ మార్పులొచ్చాయి. సినిమాను థియేటర్లో చూస్తేనే చాలామంది సంతృప్తిగా ఫీలయ్యేవారు.. అది ఒకప్పుడు.. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఉన్నచోటునే సినిమా చూడటం బెటరంటున్నారు ఇప్పుడు. జనాల అభిరుచికి తగ్గట్లు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అరచేతిలో కొత్త సినిమాలు చూసే రోజులొచ్చాయి.
కొన్ని థియేటర్కు వెళ్లొచ్చాక ఓటీటీలో రిలీజ్ అవుతుంటే మరికొన్ని మాత్రం నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'ఆహా' పేరుతో తెలుగులో తొలి ఓటీటీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఇది అనుకున్నదానికంటే బాగా క్లిక్ అయి తెలుగు ప్రేక్షకులతో ఆహా అనిపించుకుంటోంది. దీంతో ఆహాకు పోటీగా తెలుగులో మరో డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓటీటీ రంగంలోకి రానున్నారనేది దాని సారాంశం. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి రానున్న ఈ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ స్థాపనలో నాగ్తో పాటు ఆయన స్నేహితులు కూడా భాగస్వామ్యులుగా ఉండే అవకాశముందని తెలుస్తోంది. మరి ఈ వార్తలు నిజమా? కాదా? నిజమైతే కొత్త ఓటీటీ యాప్ ఎప్పుడు లాంచ్ చేస్తారనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!