కేతకీ బ్రహ్మోత్సవాలు షురూ
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి, తదితర పూజల్ని చేశారు. అదేవిధంగా అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి. అనంతరం ఆలయ అర్చకు లు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హన్మంత్రావు పాటిల్, పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఈవో శివ రుద్రప్ప, సర్పంచ్ ఫోరం మండల మాజీ అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, పాలకమండలి సభ్యుడు మల్లయ్య స్వామి, నాయకులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.


