నర్సాపూర్లో నువ్వా..నేనా!
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికలు నర్సాపూర్లో హోరాహోరీగా సాగాయి. పట్టణంలో 15 వార్డులుండగా 63 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులతో పాటు పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. కాగా ఎక్కువ చోట్ల త్రిముఖ పోటీ ఉండగా, పలు చోట్ల ద్విముఖ పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీ అభ్యర్థులకు నష్టం కల్గిస్తారనే చర్చలు పోలింగ్ పూర్తవగానే మొదలయ్యాయి. కాగా గతంలో చైర్మన్ పదవి బీఆర్ఎస్ దక్కించుకోగా, మళ్లీ ఈసారి దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నాయకులు సైతం పీఠం కోసం ప్రయత్నాలు చేశారు. కాగా గతంలో బీజేపీకి ఆరు స్థానాలు దక్కగా, ఈసారి ఎలాగైనా చైర్మన్ గిరిని దక్కించుకోవాలని గట్టిగానే పోరాడింది. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రచారం చేసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేశారు. కాగా అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాల హామీలు, తాయిలాలు ఇచ్చారు. కాగా పలు చోట్ల ఆయా పా ర్టీల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులున్నాయి. ఏ పార్టీకి ఎన్ని కౌన్సిలర్ స్థానాలు దక్కుతాయనే విషయంపై అన్ని పార్టీల్లో సందిగ్ధం నెలకొంది.


