చివరి గింజ వరకు కొంటాం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ప్రభుత్వం చివరిగింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఖేడ్, నిజాంపేట్, కల్హేర్ మండల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. గతంలో క్వింటాల్కు 7 కిలోల వరకు తరుగు పేరిట తీసేవారని, ఇప్పుడు అలా జరగకూడదని ఆదేశించామని చెప్పారు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా డబ్బులు జమ అవుతాయని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో రైస్మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకొని పనిచేశారని ఆరోపించారు. ధాన్యం తూకంలో అధికంగా తరుగు తీసుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


