
అంగన్వాడీలకు గూడు
జిల్లాకు 42 భవనాలు మంజూరు
రామాయంపేట(మెదక్): అంగన్వాడీ కేంద్రాల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాకు 42 కొత్త భవనాలను మంజూరు చేసింది. త్వరలో నిర్మాణాలు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తుంది. రేకుల షెడ్డులు, కనీస వసతులు కరువైన గదుల్లో కొనసాగిన కేంద్రాలకు త్వరలో మంచి రోజులు రానున్నాయి.
జిల్లాలో 1,076 అంగన్వాడీ కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా మొత్తం 1,076 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో కేవలం 369 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలుండగా, మరో 404 ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో కొనసాగుతున్నాయి. 303 కేంద్రాలను మాత్రం అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నారు. కిరాయి చాలా తక్కువగా ఇస్తుండటంతో కేంద్రాలకు ఇవ్వడానికి యజమానులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. రేకులషెడ్లు, పాక్షికంగా శిథిలమైన పురాతన భవనాలను అద్దెకు తీసుకొని కేంద్రాలు నడుపుతున్నారు. వీటిలో మూత్రశాలలతో పాటు కొన్నింటిలో విద్యుత్ సరఫరా సైతం లేదు. కనీస వసతులు సైతం కరువయ్యాయి. ఈ క్రమంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేయగా, ఎట్టకేలకు 42 కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. త్వరలో వీటి నిర్మాణాలు ప్రారంభించనున్నారు.
కొంతమేర ఇబ్బందులు తీరుతాయి
జిల్లాలో 42 అంగన్వాడీలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. ఈమేరకు ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు అందాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే కొంతమేర ఇబ్బందులు తీరుతాయి. మిగితా వాటికి సైతం సొంత భవనాల మంజూరు కోసం ప్రయత్నిస్తున్నాం.
– హైమావతి, డీడబ్ల్యూఓ

అంగన్వాడీలకు గూడు