
పేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: అభివృద్ధిలో రామాయంపేటను ముందుకు తీసుకెళ్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలో 83 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసి మాట్లాడారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూ. 19 కోట్ల మేర కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రామాయంపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజనికుమారి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, సీనియర్ నాయకులు సరాపు యాదగిరి, రమేశ్రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అలాగే నార్సింగి మండల కేంద్రంలో శేరిపల్లి, జప్తిశివనూర్, సంకాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మెదక్ కలెక్టరేట్: అన్నిశాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వార్డుల్లో ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.