
అంగన్వాడీల్లో ఫేస్ రికగ్నైజేషన్
● జూలై 1 నుంచి అమలుకు చర్యలు ● కేంద్ర మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ
మెదక్ కలెక్టరేట్: సంక్షేమ పథకాల్లో ఎక్కడా అవినీతి చోటుచేసుకోకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతి శాఖలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపునకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సరుకులు తీసుకునే చిన్నారులకు ‘ఎఫ్ఆర్ఎస్’ ద్వారా సరుకులు అందిస్తున్నారు. అయితే ఆరునెలల క్రితమే ఈ విధానం ప్రారంభమైనప్పటికీ ఆధార్కార్డు, సాంకేతిక సమస్యల కారణంగా వందశాతం అమలుకు నోచుకోలేదు. కాగా జూలై 1వ తేదీ నుంచి వందశాతం అమలు చేసేందుకు కేంద్ర సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అందజేసిన సెల్ఫోన్లలో పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ పకడ్బందీగా అమలు చేయనున్నారు. అందుకనుగుణంగా యాప్ను ఆధునీకరించారు.
త్వరలో కొత్త సెల్ఫోన్లు!
ప్రస్తుతం అంగన్వాడీల్లో వినియోగిస్తున్న సెల్ఫోన్ల సామర్థ్యం తక్కువగా ఉండటంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. వాటి స్థానంలో అధునాతనమైన కొత్త ఫోన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వాటిని త్వరలోనే అందజేయనున్నారు.
ప్రస్తుతం చిన్నారులకే..
అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియ మూడేళ్లలోపు చిన్నారులకు మాత్రమే కొనసాగుతుంది. పౌష్టికాహారం, బాలామృతం, గుడ్ల పంపిణీలో పారదర్శకత కోసమే దీనిని అమలు చేస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారుల కోసం ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని తల్లి ఫొటోను సెల్ఫోన్లో స్కాన్ చేస్తారు. తల్లులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
– హైమావతి, డీడబ్ల్యూఓ0
జిల్లా వివరాలు
అంగన్వాడీ కేంద్రాలు 1,076
చిన్నారులు 50,997
గర్భిణులు 5,599
బాలింతలు 4,507

అంగన్వాడీల్లో ఫేస్ రికగ్నైజేషన్