
బడికి వేళాయె..!
ఆటాపాటలతో వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ తొలిరోజే అందించేందుకు సిద్ధం చేసింది. ఇక తల్లిదండ్రులు పొద్దున్నే పిల్లలను రెడీ చేయడం, పాఠశాలలకు వెళ్లబోమని మారం చేస్తే బుజ్జగించడం వంటివి మొదలుకానున్నాయి. – మెదక్జోన్
నేటి నుంచి పునఃప్రారంభం
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● ప్రభుత్వ పాఠశాలలబలోపేతానికి బడిబాట ● జిల్లావ్యాప్తంగా 922 పాఠశాలలు, 87 వేల మంది విద్యార్థులు
పుస్తకాలు, యూనిఫామ్స్ రెడీ
తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 4,60,408 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటికే ఆయా పాఠశాలలకు చేరాయి. అలాగే ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫాం అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 80 శాతం మాత్రమే కుట్టడం పూర్తికావడంతో మొదటి రోజున ఒక్కో జత అందించేందుకు సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లో మరో జత యూనిఫాం అందజేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
జిల్లావ్యాప్తంగా మొత్తం 922 పాఠశాలలు ఉండగా, వాటిలో 87 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా గతేడాది ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా 562 పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతుల కోసం రూ. 20 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో తాగునీటి సౌకర్యం, పాఠశాలల పైకప్పుల మరమ్మతులు, మరుగుదొడ్లు, కిచెన్షెడ్లు, పాఠశాలల చుట్టూ ప్రహరీ, కరెంట్ మరమ్మతులు, కిటికీలు, తలుపులకు రిపేర్లు చేయించి మౌలిక వసతులు కల్పించారు.
బడిబాటలో 1,800 మంది గుర్తింపు
జిల్లాలో బడిబాటను ఈనెల 6 నుంచి ఉపాధ్యాయులు ప్రారంభించారు. ఇది ఈనెల 19 వరకు కొనసాగించనున్నారు. అయితే ఇప్పటికే 1,800 విద్యార్థులను గుర్తించి వివిధ పాఠశాలల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా వేసవి సెలవుల్లో ముందస్తు బడిబాటలో భాగంగా జిల్లాలో డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించారు. ఇంటింటికీ తిరిగి సర్కారు బడిలో కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన గురించి తల్లిదండ్రులకు వివరించారు. అలాగే వివిధ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి చదువు ప్రాధాన్యతను చెప్పారు. ఇదిలా ఉండగా అంగన్వాడీ పాఠశాలల నుంచి 7 వేల పైచిలుకు విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్నారు.
భవిత సెంటర్లకు రూ. 1.20 కోట్లు
దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్ కోసం జిల్లాలో 21 భవిత సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా వాటిలో ప్రస్తుతం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలు ఉండగా, మండలానికో పాఠశాలను గుర్తించి వాటిలో భవిత సెంటర్లు కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహించి వినికిడి యంత్రాలతో పాటు చేతికర్రలు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నారు. వీరికి ఆట వస్తువులను చూపుతూ చదువు చెబుతారు. అయితే ఆ సెంటర్లలో మరుగుదొడ్లు, తాగునీరు తదితర అవసరాల కోసం రూ. 1.20 కోట్ల నిధులు విడుదల కాగా, మరమ్మతులు చేపడుతున్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా 3,400 మంది ఉపాధ్యాయులకు గత నెలలో 19 రోజుల పాటు పలు అంశాలపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా విద్యార్థుల స్థాయిని గుర్తించడం, వెనుకబడిన వారికి అర్థమయ్యేలా బోధించడం, మారుతున్న బోధనా విధానాలను అనుసరించడంతో పాటు ఏఐపై అవగాహన కల్పించారు.
సర్కారు బడిలోనే సంపూర్ణ విద్య
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోంది. అన్ని అర్హతలు గల ఉపాధ్యాయులచే బోధన సాగుతుంది. అలాగే పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్దాం. పుస్తకాలు, యూనిఫామ్స్ ఉచితంగా అందజేస్తాం. తల్లిదండ్రులు విద్యార్థులను సర్కారు బడుల్లోనే చేర్పించాలి.
– రాధాకిషన్, డీఈఓ

బడికి వేళాయె..!