భూసేకరణ కొలిక్కి..! | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ కొలిక్కి..!

Jun 12 2025 11:02 AM | Updated on Jun 12 2025 11:02 AM

భూసేకరణ కొలిక్కి..!

భూసేకరణ కొలిక్కి..!

పలు గ్రామాల అవార్డులకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదముద్ర
● పరిహారం చెల్లించేందుకు రెవెన్యూశాఖ సన్నాహాలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వస్తోంది. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూ సేకరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన అవార్డు (సేకరించే భూముల సర్వేనంబర్లు, పట్టాదారుల పూర్తి వివరాలు)లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం ఆమోదముద్ర వేసింది. మరికొన్నింటికి అప్రూవల్‌ రావాల్సి ఉంది. ఈ ఆమోదం వచ్చి న వెంటనే నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి గేమ్‌ చేంజర్‌గా భావిస్తున్న ఈ రహదారి ఉత్తర భాగం 161 కి.మీలు సంగారెడ్డి, ఆందోల్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌ ఆర్డీఓలు భూసేకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

ఇదీ జరిగింది...

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఆర్డీఓ పరిధిలో శివంపేట, నర్సాపూర్‌ మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో 1,048 మంది రైతుల వద్ద మొత్తం 758 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి 28 అవార్డులను ప్రకటించారు. ఇందులో ఎన్‌హెచ్‌ఏఐ పీడీ కార్యాలయం నుంచి 13 అవార్డులకు ఇప్పటికే అనుమతి లభించింది. మరో 15 అవార్డులకు అప్రూవల్‌ వచ్చిన వెంటనే పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌లోని 13 గ్రామాలు, ఆందోల్‌ డివిజన్‌లోని ఐదు గ్రామాలు కలిపి మొత్తం 824 ఎకరాలు సేకరిస్తున్నారు. సంగారెడ్డి డివిజన్‌కు సంబంధించి 24 అవార్డులకుగాను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆరింటికి మాత్రమే అప్రూవల్‌ ఇచ్చారు. ఆందోల్‌కు సంబంధించిన భూసేకరణ అవార్డులకు అప్రూవల్‌ రావాల్సి ఉంది. తూప్రాన్‌ ఆర్డీఓ పరిధిలో 430 ఎకరాల భూములను సేకరిస్తున్నారు. ఎనిమిది గ్రామాల్లోని 482 మంది రైతులు నిర్వాసితులుగా మారుతున్నారు. ఆయా గ్రామాలకు సంబంధించిన అవార్డులకు అప్రూవల్‌ కోసం ఎన్‌హెచ్‌ఏఐకి పంపనున్నారు. ఈ అప్రూవల్‌ వచ్చిన వెంటనే రెవెన్యూ అధికారులు నిర్వాసిత రైతులకు పరిహారం పంపిణీ చేస్తారు.

కనీసం రూ.70 లక్షలు

చెల్లించాలంటున్న నిర్వాసితులు..

తప్పనిసరి పరిస్థితుల్లో తమ భూములు గుంజుకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని నిర్వాసితులుకోరుతున్నారు. గతంలో పలుచోట్ల ఈ భూసేకరణకు సంబంధించిన సర్వే పనులను నిర్వాసిత రైతులు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిహారం కింద ఎకరానికి రూ.70 లక్షలు చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రధానంగా నర్సాపూర్‌ మ ండలం రెడ్డిపల్లి వంటి గ్రామాల నిర్వాసితులు ఈ భూసేకరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే పనులను కూడా అడ్డుకున్నారు.

మూడేళ్లలో జరిగిన లావాదేవీలను బట్టి ధర

భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించేందుకు ధర నిర్ణయం చేయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో మూడేళ్లుగా జరిగిన భూముల క్రయవిక్రయాలకు ధరను బట్టి...ఈ పరిహారం లెక్కిస్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు పరిహారం అందే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కనీసం రూ.70 లక్షలు చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement