
బడిగంట మోగింది
మెదక్జోన్: బడిగంటలు గణగణ మోగాయి. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశా లలు తెరుచుకున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ఆరంభం అయింది. ఇంటి వద్ద ఆటాపాటలతో గడిపిన పిల్లలు బడిబాట పట్టారు. బడిలో అడుగుపెట్టగానే ఉపాధ్యాయులు పూలు అందించి ఘన స్వాగతం పలికారు. కాగా తొలిరోజు విద్యార్థులు అంతంత మాత్రంగానే పాఠశాలలకు వచ్చారు. చాలా చోట్ల ఉదయం ప్రార్థనలో ఉపాధ్యాయులే దర్శనం ఇచ్చారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ అధికారులు చెప్పినట్టుగానే విద్యార్థులకు మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాంలు అందించారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు, యునిఫాంలు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన కౌడిపల్లి ఉన్నత, బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృిషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సొంతభవనం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలరాజు, హెచ్ఎంలు సాజిద్అలీ, పద్మజ, ఓంప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సర్కారు బడులపై నమ్మకం పెరిగింది
పాపన్నపేట(మెదక్)/అల్లాదుర్గం/టేక్మాల్: ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ బడి నుంచి విద్యార్థులు రావడం కొత్త మార్పుకు నిదర్శనమని డీఈఓ రాధాకిషన్ అన్నారు. గురువారం పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ బడులన్నీ ప్రజలయే అన్న విషయాన్ని గుర్తించి, ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరారు. అధునాతన విద్యావిధానంతో పాటు చిన్నప్పటి నుంచే పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ విద్య అందిస్తున్నామని, కృత్రిమ విద్య సైతం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్, సొసైటీ చైర్మన్ మల్లేశం, హెచ్ ఎం సాయికుమార్, టీచర్లు రవీందర్ రెడ్డి, సాయిలు, వేణుగోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం టేక్మాల్ మండలంలోని బొడ్మమటిపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు. అలాగే అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ పీఎంశ్రీ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు.
తొలి రోజు హాజరు అంతంతే..
విద్యార్థులకు యూనిఫాం,పాఠ్యపుస్తకాలు పంపిణీ