
భూభారతికి దరఖాస్తుల వెల్లువ
8 రోజులు.. ● 216 సదస్సులు.. ● 13,693 అర్జీలు
మెదక్ కలెక్టరేట్: భూ భారతి రెవెన్యూ సదస్సులకు జిల్లాలో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు కొండంత నమ్మకంతో తరలివస్తున్నారు. జిల్లాలోని 216 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా, రైతులు తమ సమస్యలపై ఇప్పటివరకు 13,693 అర్జీలు సమర్పించారు. అయితే అత్యధికంగా అసైన్డ్ భూముల సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, సాదాబైనామాలు, పాస్పుస్తకంలో తప్పులు వంటి సమస్యలపై అత్యధికంగా దరఖాస్తులు అందజేస్తున్నారు. ఇదిలాఉండగా రెవెన్యూ సదస్సులను కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్తో పాటు ఆర్డీఓలు సందర్శించి దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ భరోసా కల్పిస్తున్నారు.
ఆరుగురు అధికారుల బృందం
జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో ఆరుగురు అధికారుల బృందం పాల్గొంటున్నారు. ఈ బృందంలో తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారులు బృందంగా ఏర్పడి రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. రైతుల నుంచి వినతులు స్వీకరించి కేటగిరీల వారీగా విభజిస్తున్నారు.
హెల్ప్డెస్క్ల ఏర్పాటు
గ్రామాల్లో చాలా వరకు రైతులు నిరక్షరాస్యులుగా ఉండటంతో వారికి ఉపయోగపడేలా హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచితంగా దరఖాస్తు పత్రాలు ఇవ్వడంతో వారి సమస్యను అక్కడే హెల్ప్డెస్క్ అధికారులు రాసిస్తున్నారు.
అంశాలు అర్జీలు
అసైన్డ్ భూ సమస్యలు 2,639
సర్వే నంబర్ మిస్సింగ్ 2,624
సాదాబైనామాలు 2,429
పీఓటీలు 2,014
పాస్పుస్తకంలో తప్పులు 964
ఓఆర్సీ 412
సక్సెషన్ 435
మ్యూటేషన్ పెండింగ్ 307
కొత్త అసైన్డ్ భూములు 246
ఫారెస్ట్, రెవెన్యూ సర్వే కోసం 164
ఇతర సమస్యలపై 1,459