
డబ్బులు లేక.. పనులు ప్రారంభించక
రామాయంపేట(మెదక్): ‘ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ముందు పనులు చేస్తే గాని ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కావు. ఇప్పుడు ఇంటి నిర్మాణం ఎలా’ అని మండలంలోని ఝాన్సిలింగాపూర్ పంచాయతీ పరిధిలోని సదాశివనగర్ తండాకు చెందిన గిరిజన మహిళ రజిత ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో భర్త విద్యుత్షాక్తో మృతిచెందగా, కట్టెలు అమ్మి, కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పోషిస్తుంది. ప్రస్తుతం శిథిలమైన పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో తండాకు మూడు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అందులో రజిత పేరు ఉంది. అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంటి నిర్మాణానికి దూరంగా ఉంటుంది. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేస్తే మొదటి బిల్లు వస్తుందని అధికారులు చెబుతుండగా, డబ్బులు లేకపోవడంతో పనులు ప్రారంభించలేదు. దాత లు సహకరించాలని వేడుకొంటుంది. రజిత ఇళ్లు నిర్మించుకునేందుకు సహాయ సహకారాలు అందజేస్తామని ఎంపీడీఓ సజీలుద్దీన్ హామీ ఇచ్చారు.