లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
మెదక్ కలెక్టరేట్: ఈనెల 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా లోక్ అదాలత్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆర్ఎం సుభవల్లి తదితరులు పాల్గొన్నారు.
ఆ బాధ్యత ప్రభుత్వానిదే: పీఆర్టీయూ
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం అవుతున్నాయని, జిల్లాలోని చాలా వరకు బడుల్లో కనీస వసతులు లేవన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో విద్యార్థులను నాణ్యమైన విద్యకు దూరం చేయొద్దన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా ప్రభుత్వం మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. అందులోని విద్యార్థులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్చుకొనే అవకాశం ఉందన్నారు. దీంతో పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
392 మందికిసీట్ల కేటాయింపు
కౌడిపల్లి(నర్సాపూర్): ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి బుధవారం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ హరిబాబు తెలిపారు. జిల్లాలోని వివిధ ఎంజేపీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న 392 సీట్లు భర్తీ చేయగా, ఇందులో 217 మంది బాలికలు, 175 మంది బాలురు ఉన్నట్లు చెప్పారు. వీరికి గురుకుల పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్లు వివరించారు.
దేశవ్యాప్త సమ్మెనుజయప్రదం చేద్దాం
శివ్వంపేట(నర్సాపూర్): కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని దొంతిలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్, నాయకులు రవీంద్రప్రసాద్, శంకర్, ప్రభాకర్, లక్ష్మణ్, వసంత, శ్రీకాంత్, పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ధ్రువపత్రాల పరిశీలన
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని డైట్ కళాశాలలో డీసెట్ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. 9వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కాగా బుధవారం వరకు 900మంది సర్టిఫికెట్లను పరిశీలించినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. మొత్తం 2,198 మందికి గాను నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మిగితా విద్యార్థులు 11వ తేదీ లోపు హాజరుకావొచ్చని సూచించారు. 13వ తేదీన అభ్యర్థుల ర్యాంకును బట్టి సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి


