
గడువులోగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి
మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహిస్తే అర్హులైన ఇతరులకు అవకాశం కల్పిస్తామని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి మొదటి విడతలో 1,555, రెండో విడతలో 8,260 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. కాగా జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్, నారాయణఖేడ్, సిద్దిపేటలోని దుబ్బాక, గజ్వేల్, నియోజకవర్గాలకు సంబంధించిన మరో 8 మండలాలు మెదక్ జిల్లాలోనే ఉన్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మొత్తం 9,815 ఇళ్లను మంజూరు చేసిందని వివరించారు.
రూ.1.80 కోట్ల బిల్లులు చెల్లించాం
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన 180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.80 కోట్లు జమ చేశాం. జిల్లాలో 450 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. మిగితా లబ్ధిదారులు ఇంకా ప్రారంభించలేదు. ఉచితంగా ఇసుక అందించడంతోపాటు నిర్మాణాలు ప్రారంభించగానే వారంవారం బిల్లులు మంజూరు చేస్తామని చెబుతున్నా, లబ్ధిదారుల్లో మార్పు రావడం లేదు. అలాంటి వారిని పక్కన పెట్టి వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పిస్తాం.
నిరుపేదలను ఆదుకుంటాం
ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. జిల్లాలో సుమారు 200 మంది వరకు సొంతిళ్లు నిర్మించుకోలేని నిరుపేదలు ఉన్నట్లు గుర్తించాం. వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం ఇప్పించి ఇంటి నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తున్నాం. వారి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఆర్థికంగా ఉండి ఇళ్ల నిర్మాణం చేపట్టకుంటే మూడు నెలల గడువు ఇస్తాం. అయినప్పటికీ నిర్మాణాలు చేపట్టకుంటే వారి స్థానంలో ఇతర అర్హులకు అవకాశం కల్పిస్తాం.
మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తున్నాం
ఇటీవల మలి విడతలో భాగంగా ప్రభుత్వం 8,260 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తాం. జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నా లుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా మున్సిపల్ కమిషనర్లు ప్రొసీడింగ్ పత్రాలు అందజేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతాం.
నిర్లక్ష్యం వహిస్తేకొత్తవారికి అవకాశం
జిల్లాకు 9,815 ఇందిరమ్మఇళ్లు మంజూరు
‘సాక్షి’తో హౌసింగ్ పీడీ మాణిక్యం

గడువులోగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి