
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
నర్సాపూర్: మండల లీగల్ సర్వీస్ కమిటీ నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జూనియర్ సివిల్ జడ్జిహేమలత ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కోర్టు పరిధిలోని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు పలుశాఖల అధికారులతో కోర్టులో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మండల లీగల్ సర్వీస్ కమిటీని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వాటిని లీగల్ సర్వీస్ కమిటీ ఫ్రీ లిటిగేషన్ కేసుగా నమోదు చేసి సంబంధిత మండలస్థాయి అధికారులకు, వ్యక్తులకు నోటీసులు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జూనియర్ సివిల్ జడ్జి హేమలత