
పట్టుకుంటే బంగారమే!
సాంప్రదాయ వ్యవసాయంతో నష్టాలు చవిచూస్తున్న రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకంతో ప్రతి నెల ఆదాయం ఆర్జించవచ్చు. తక్కువ సమయంలోనే అధికంగా లాభాలు పొందవచ్చు. అయితే జిల్లాలో కేవలం మల్బరీ సాగు 95 ఎకరాల్లో ఉండగా, పట్టు పురుగుల పెంపకానికి 20 షెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికై నా చిన్న, సన్నకారు రైతులు సబ్సిడీలతో పాటు, తక్కువ పనితో ఎక్కువ ఆదాయం ఆర్జించే పట్టు పురుగుల పెంపకంపై ఆసక్తి చూపాలని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. – చిలప్చెడ్(నర్సాపూర్)
చిన్న, సన్నకారు రైతులకు పట్టు పురుగుల పెంపకం సులభమైనది. ఒక్కసారి పెట్టుబడితో కొన్నేళ్ల వరకు లాభాలు ఆర్జించవచ్చు. కేంద్ర ప్రభుత్వం షెడ్డు నిర్మాణానికి రూ. 2.4 లక్షల సబ్సిడీతో పాటు, ఎకరా మల్బరీ మొక్కలకు రూ. 30 వేల రాయితీ ఇస్తుంది. మొక్కల ఎదుగులకు అనువైన నేలలు ఉండి, పట్టు పురుగుల పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉంటే నాణ్యమైన కకూన్స్ (పట్టు పురుగులు అల్లుకున్న గూళ్లు) వస్తాయి. దీంతో అధిక లాభాలు పొందవచ్చు. పట్టు పురుగుల గుడ్లు తెచ్చిన నాటి నుంచి 30 రోజుల్లో బ్యాచ్ పూర్తవుతుంది. రెండెకరాల మల్బరీ సాగుతో బ్యాచ్కు రూ. లక్ష వరకు అదాయం వస్తుంది. చాకి పెంపకం (పట్టు పురుగుల గుడ్ల నుంచి వచ్చే పిల్లల)తో మరింత ఆదాయం సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 30 వేల డీఎఫ్ఎల్ చాకీ పెంపకం పిల్ల పురుగుల ధర రూ. 3,500 ఉంటే, మాములు గుడ్లు రూ. 1,300 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన కకూన్స్ ధర క్వింటాల్కు రూ. 50 వేలు ఉంది. ప్రభుత్వం కిలోకు రూ. 75 అదనంగా చెల్లిస్తుంది. అయితే నాలుగేళ్లుగా అదనపు డబ్బులు చెల్లించడం లేదు. రాష్ట్రంలో హైదరాబాద్లోని తిరుమలగిరి, జనగాంలో పట్టు పరుగుల కకూన్స్ కొనుగోలుకు మార్కెట్లు ఉన్నాయి. నాణ్యతను బట్టి వాటికి ధర ఉంటుంది. మేలు రకం కకూన్స్కు వందశాతం డబ్బులు చెల్లిస్తారు.
జిల్లాలో 95 ఎకరాల్లోమల్బరీ సాగు
సబ్సిడీ, ఆదాయం ఉన్నాఆసక్తి చూపని రైతులు ముందుకు రావాలని అధికారుల సూచన
రైతులకు మంచి అవకాశం
జిల్లాలో పట్టు పురుగుల పెంపకం చాలా తక్కువ. రైతులు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలు గడించవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు సెరికల్చర్ మంచి అవకాశం. పైగా ప్రభుత్వం సబ్సిడీ సైతం ఇస్తుంది. ఒక్కసారి పెట్టుబడితో ఎన్నో ఏళ్లుగా లాభాలు గడించవచ్చు. ఇప్పటికై నా రైతులు ముందుకు రావాలి.
– ప్రతాప్సింగ్, జిల్లా ఉద్యాన అధికారి
ప్రతీ నెల డబ్బులు
సేంద్రియ ఎరువులతో మల్బరీ సాగు చేస్తున్నా. పట్టు పురుగులకు లేత మల్బరీ ఆకులు మేతగా వేస్తే నాణ్యమైన కకూన్స్ వస్తాయి. పట్టు పురుగుల పెంపకంతో నెల నెల రాబడి వస్తుంది. సంవత్సరంలో తొమ్మిది బ్యాచ్లు పూర్తయ్యాయి. ఏది ఏమైనా రెండెకరాలు మల్బరీ సాగుతో తయారైన బ్యాచ్తో ఖర్చులు అన్నీ పోనూ. రూ. 80 వేలు మిగులుతుంది.
– జూపల్లి జ్యోతిర్మయి, రైతు, చిలప్చెడ్

పట్టుకుంటే బంగారమే!

పట్టుకుంటే బంగారమే!

పట్టుకుంటే బంగారమే!