
రైతన్నకు విశిష్ట గుర్తింపు కార్డు
జిల్లాలో కొనసాగుతున్న నమోదు ప్రక్రియ
పాపన్నపేట(మెదక్): ఆధార్ కార్డులా.. రైతన్నకు విశిష్ట గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. ఒక్కో రైతుకు 11 నంబర్ల విశిష్ట సంఖ్య (యూనికోడ్) కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసే దిశగా ఈ ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించి. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి చేసింది. ఈ మేర కు జిల్లావ్యాప్తంగా సోమవారం నమోదు ప్రక్రి య ప్రారంభమైంది. జిల్లాలో 2,91,399 రైతు లు ఉండగా, 3,92,904 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
ఓటీపీ సమస్యలు
కేంద్ర ప్రభుత్వ పథఽకాలు పొందేందుకు సరైన గణాంకాలు, ధ్రువీకరణ, నమోదు వివరాలు కేంద్రం వద్ద లేవు. రైతుల వారీగా పంటల వివరాలు తెలయడం లేదు. దీంతో కేంద్ర పథకాలు రైతులకు సకాలంలో అందడం లేదు. అందుకే విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆధార్ కార్డుకు 12 అంకెలు ఉంటే, ఈ కార్డుకు 11 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ప్రస్తుతం అధికారులు ఓటీపీ లాంటి కొన్ని సమస్యలను గుర్తించారు. అవి పరిష్కరించాక, మీసేవ కేంద్రాల్లో కూడా యూనిక్ కార్డులు తీసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల లబ్ధి పొందాలంటే ఈ కార్డు ఉండాలి. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఇది తప్పని సరి కాదు.
పాస్బుక్, ఆధార్ కార్డు అవసరం
విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్, ఫోన్ నంబర్తో ఏఎంఓ, ఏఈఓల వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారులకు మూడు ఓటీపీలు వస్తాయి. దాని ధ్రువీకరణ ద్వారా విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్ తదుపరి విడత నిధుల విడుదలకు ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా, రుణమాఫీ పథకాలకు ఈ కార్డుతో సంబంధం లేదు. రెవె న్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికమని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పథకాలు
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే జిల్లాలోని పలు క్లస్టర్లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతోంది. ఓటీపీ రాకపోవడం లాంటి చిన్న సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అవి త్వరలో పరిష్కారం అవుతాయి. అవసరమైన సూచనల కోసం వ్యవసాయ విస్తరణ అధికారుల సహాయం తీసుకోవాలి.
– వినయ్, జిల్లా వ్యవసాయాధికారి

రైతన్నకు విశిష్ట గుర్తింపు కార్డు