
అంగన్వాడీల కు తీపి కబురు
అంగన్వాడీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జిల్లాలో 191 మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ కానున్నాయి. దీంతో ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు వేతనాలు పెరగనున్నాయి. తమను మేజర్ అంగన్వాడీలుగా గుర్తించాలని, సహాయకులను నియమించాలని గత కొన్నేళ్లుగా టీచర్లు ఆందోళనకు చేస్తుండగా, తాజాగా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. – రామాయంపేట(మెదక్)
జిల్లాలో 885 మేజర్, 191 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పెద్ద సెంటర్లలో టీచర్లకు తోడు హెల్పర్లు (సహాయకులు) ఉన్నారు. చిన్న కేంద్రాల్లో మాత్రం కేవలం టీచర్లను మాత్రమే నియమించారు. ఈ సెంటర్లకు హెల్పర్లను నియమించకపోవడంతో టీచరే అన్ని పనులు చేయాల్సి వచ్చేది. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వంట చేసి పెట్టాలి. ప్రతి రోజు వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు రికార్డులు రాయాలి. చిన్నారుల కొలతలు సేకరించాలి. దీంతో పాటు తల్లిపాల విశిష్టత, పౌష్టికాహారం విషయమై గృహ సందర్శన చేసి పిల్లల తల్లులకు అవగాహన కల్పించాలి. ఇలా టీచర్లు పని ఒత్తిడితో నిత్యం సతమతమతం అవుతున్నారు. తమ కేంద్రాలను మేజర్ సెంటర్లుగా గుర్తించి, వేతనాలు పెంచాలని గత కొంతకాలంగా వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు వీరి మొరను ప్రభుత్వం ఆలకించింది. మినీ సెంటర్ల టీచర్లను ప్రధాన అంగన్వాడీ టీచర్లుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి పెరిగిన వేతనాలు రూ. 13,650 వెంటనే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా మినీ అంగన్ వాడీ టీచర్లు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు.
మినీ కేంద్రాల టీచర్లకు వేతనం పెంపు
జిల్లాలో 191 మందికి ప్రయోజనం
అన్ని కేంద్రాల్లో హెల్పర్ల సదుపాయం