
రాని బిల్లులు.. ఆగిన నిర్మాణాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతుల పేర్లు భూలి, శంకర్. వీరిది చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి తండా. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రావడంతో వారు నివస్తున్న గుడిసెను తొలగించి అదే స్థలంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. బేస్మెంట్ వరకు పూర్తి చేసినా.. యాప్లో ఫొటో అప్లోడ్ కాకపోవడంతో బిల్లు మంజూరు కావడం లేదు. ఇప్పటికే రూ. రెండు లక్షల వరకు ఖర్చు చేశామని.. ఇక తాము ముందుకు వెళ్లలేకపోతున్నామని నిర్మాణ పనులు ఆపేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు ఇంటి బిల్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): ఎన్నో ఆశలతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రారంభించిన పేదలకు తిప్పలు తప్పడం లేదు. బేస్మెట్ వరకు పూర్తి చేసినా బిల్లు రాకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే వదిలేస్తున్నారు. యాప్లో ఇంటి నిర్మాణ ఫొటో అప్లోడ్ చేసిన వెంటనే రూ. లక్ష లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే నెల రోజులుగా ఫొటో అప్లోడ్ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి తండాను ప్రజాపాలన పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన అధికారులు 80 మందిని ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా తేల్చారు. ఇందులో అసలే ఇళ్లు లేని 25 మందికి మొదటి దశలో ఇళ్లు కేటాయించారు. వెంటనే పనులు ప్రారంభించాలని వారిని ఆదేశించారు. దీంతో గిరిజనులు తాము ఉంటున్న గుడిసెలను తొలగించి ఇంటి పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 10 మంది బేస్మెంట్ వరకు పనులు పూర్తిచేయగా, మరికొందరు పునాదులు తీశారు. అయితే ఫొటో అప్లోడ్ విషయమై ఇటీవల గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం, ఇతర అధికారులు మిర్జాపల్లి తండాకు వచ్చి ప్రయత్నించినా ఫలితం కన్పించలేదు. దీంతో ఉన్న గుడిసెను తొలగించి తాత్కాలిక గుడారాల్లో నివసిస్తున్న తమ పరిస్థితి ఏంటని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై చిన్నశంకరంపేట ఎంపీడీఓ దామోదర్ను వివరణ కోరగా.. ఇందిరమ్మ యాప్లో ఏర్పడిన సమస్యతో ఫొటో అప్లోడ్ చేయలేకపోతున్నామని, ఇదే విషయం గృహ నిర్మాణ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ కాకుండా ఆఫ్లైన్లో బిల్లు మంజూరు చేయాలని కోరామని, వారి నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు.
ఫొటో అప్లోడ్ కాక తిప్పలు
మధ్యలోనే నిలిచిన ఇందిరమ్మ ఇళ్లు

రాని బిల్లులు.. ఆగిన నిర్మాణాలు