
కల్లాల ఆశలు కల్లలు
ధాన్యం ఆరబెట్టలేక రైతుల తిప్పలు
రామాయంపేట(మెదక్): ఆరుగాలం శ్రమించే రైతులకు పంటను ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారుతోంది. కల్లాలు లేక రహదారుల వెంట ఆరబోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రైతులు కల్లాలు నిర్మించుకోవడానికి వీలుగా కేంద్రం ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా పరిధిలో 2,000 మందికి పైగా రైతులు వీటిని నిర్మించుకున్నారు. అయితే గత రెండున్నర ఏళ్ల క్రితం ఈ పథకం రద్దు కావడంతో ఆందోళన చెందుతున్నారు. పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడం, తూర్పార పట్టడానికి సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో తారు రోడ్లు, వ్యవసాయ బోర్ల వద్ద మడుల్లో ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ముఖ్యంగా రోడ్డుపై ఆరబెడుతున్న ధాన్యంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యం కుప్పలను ఢీకొని రెండేళ్లలో జిల్లా పరిధిలో ఎనిమిది మందికి పైగా వాహనదారులు మృతిచెందారు. రోడ్డుపై ధాన్యం ఆరబోసినందుకు గాను జిల్లా పరిధిలో కొందరు రైతులపై గతంలో కేసులు సైతం నమోదయ్యాయి. కల్లాలు మంజూరు చేసిన మొదట్లో సరైన అవగాహన లేకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో చాలా మంది పూర్తిస్థాయిలో నిర్మించుకోలేదు. కల్లాలు అత్యవసరమని ఇప్పుడిప్పుడే రైతులు గుర్తిస్తున్న క్రమంలో ఈ పథకం రద్దయింది. కేంద్రం తిరిగి ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
పథకం రద్దయింది
గతంలో ఉపాధి హామీ పథకంలో కేంద్రం కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దీంతో జిల్లా పరిధిలో చాలా మంది రైతులు వీటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం రద్దయింది. తిరిగి పునరుద్ధరిస్తే రైతులకు మేలు కలుగుతుంది.
– శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

కల్లాల ఆశలు కల్లలు