● కలెక్టర్ రాహుల్రాజ్
● ‘పేట’లో నీటి సమస్య లేదని స్పష్టీకరణ
రామాయంపేట(మెదక్): జిల్లాలో ఎల్ఆర్ఎస్ పథకం కింద 22 వేల దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. ఒకటో వార్డులో నీటి ఎద్దడి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నెలాఖరులోగా డబ్బులు చెల్లిస్తే 25 శాతం మేర రాయితీ లభిస్తుందని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో తాగు నీటి ఎద్దడి సమస్య లేదని, ఎక్కడైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకరావాలని సూచించారు. రామాయంపేట పరిధిలో ఎక్కడ కూడా పంటలు ఎండిపోవడం లేదని, రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా పరిధిలో 2.61 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, ఇతర జిల్లాలతో పోలిస్తే పంట ఎండిపోయిన ఘటనలు తక్కువ అని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.