మెదక్ కలెక్టరేట్: డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి భారీగా తరలివచ్చిన అంగన్వాడీలు కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రధాన గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి నర్స మ్మ మాట్లాడుతూ ఐసీఐడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని చూస్తుందన్నారు. ఇవి అమలు జరిగితే క్రమంగా ఐసీడీఎస్ బలహీనపడి, శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందన్నారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కు నష్టం కలిగించే ఈ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్లో అందజేశారు.
డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా