ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: తాగునీటి పరంగా ఇబ్బందులను తీర్చేందుకు చేపట్టనున్న పనుల్లో శాశ్వత పనులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాగునీటి పథకాల పునరుద్ధరణ, ఇతర పనులకోసం ఇటీవల రూ.6.50కోట్లతో ప్రతిపాదనలు పంపగా స్థానిక అధికారులు అవసరమైన పనులను గుర్తించినట్లు చెప్పారు. మిషన్ భగీథ పథకం ద్వారా నిరంతరం నీటిసరఫరా జరిగేలా గొర్రెకల్ వద్ద డెడికేటెడ్ విద్యుత్ లైన్ పనులు చేయిస్తున్నామన్నారు. బోరంచ, శాపూర్ పథకాలను పునరుద్ధరించి బోరంచ నుంచి మార్గమధ్యలోని గ్రామాలతోపాటు ఖేడ్ మున్సిపాలిటీ అవసరాల మేర నీటిసరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యదర్శులు భగీరథ ద్వారా నీరు సక్రమంగా సరఫరా అయితేనే రిజిస్టర్లో సంతకాలు చేయాలని లేని పక్షంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవోలకు సమాచారం అందించాలన్నారు. వేసవి ముగిసేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో నాయకులు దారంశంకర్, అశోక్రెడ్డి, సంగన్న, రాజేందర్పాటిల్, రాజు, విఠల్రావు, పరశురాం పాల్గొన్నారు.