నేరడిగొండ: మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ జరగగా పోలీసులు కేవలం 24 గంటల్లోనే కేసు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జాదవ్ భీంరావు ఇంట్లో లేని సమయం చూసి గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు లోనికి చొరబడ్డారు. ఇంట్లోని ఐదు తులాల బంగారం, రూ.10వేల నగదు అపహరించుకుపోయారు. చోరీ జరిగినట్లు తెలుసుకున్న బాధితుడు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో లభించిన సీసీ టీవీ ఫుటేజీలను ఎస్సై క్షుణ్ణంగా పరిశీలించారు. అందులోని దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మండలంలోని గుత్పాల గ్రామానికి చెందిన దావుల సుమన్, భోగి శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తామే చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకొన్నారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చోరీకి గురైన సొత్తులో రూ.7.20లక్షలు రికవరీ చేశామని తెలిపారు. త్వరగా కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.


