టెండర్ పెంచిన బెల్ట్
73 మద్యం షాపులకు 1,712 దరఖాస్తులు ఆదాయం 51.36 కోట్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వైన్స్ షాపుల టెండర్లలో బెల్ట్షాపులే వ్యాపారుల మధ్య పోటీని డిసైడ్ చేస్తున్నాయి. ఏ లిక్కర్షాపు కింద ఎన్ని బెల్ట్షాపులు, ఎంత జనాభా ఉంటే అంత ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 73 మద్యం షాపులకు టెండర్ల గడువు గురువారంతో ముగిసింది. రూ.లక్షల దరఖాస్తు ఫీజుతో చాలా మంది గ్రూప్ల వారీగా టెండర్లలో పాల్గొన్నారు. కొందరు ధైర్యం చేసి సింగిల్ వేశారు. జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొన్నారు.
ఆ ఐదు షాపులకే...
జిల్లాలో ఐదు షాపులకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. భీమిని, కన్నెపల్లిలో మద్యం అమ్మకాలు తక్కువగా ఉండడంతో గతంలో, ఈసారి అక్కడ ఎవరూ టెండర్లకు ఆసక్తి చూపలేదు. ఉదాహరణకు జాతీయ రహదారి, గోదావరికి సమీపంలో ఉన్న జైపూర్ మండలం ఇందారం వైన్స్కు డిమాండ్తో (గెజిట్ నంబర్ 1)కు 64 దరఖాస్తులు వచ్చాయి. కొన్నేళ్లుగా ఇక్కడి షాపును దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. జాతీయ రహదా రిపై ఉండడం, సింగరేణి ఓపెన్కాస్టులు, గోదావరి ఖని సమీపంలో ఉండడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ఈ వైన్స్ నుంచే మద్యం సరఫరా అవుతోంది. దీంతో బెల్ట్షాపులే గ్రామాల్లో వైన్స్ల మాదిరిగా అమ్మకాలు సాగిస్తున్నాయి. భీమారంలో 59, హాజీపూర్లో 57, బెల్లంపల్లి పరిధిలో 45, కోటపల్లి పరిధిలో 45 చొప్పున అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ షాపుల పరిధి గ్రామాల్లోని బెల్ట్షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువతో రాత్రిపగలు తేడా లేకుండా అమ్మేస్తున్నారు. గ్రామాలు, జనా భా ఎక్కువ ఉన్న చోట్ల బెల్ట్షాపుల్లో అమ్మకాలు ఎ క్కువగా ఉంటాయి. దీంతో ఆ ప్రాంత వైన్స్లకు రూ.లక్షల్లో కౌంటర్ అవుతోంది. రిటైల్ కంటే బెల్ట్ కు హోల్సేల్ వ్యాపారం సాగుతోంది. దీంతో ఆ షాపులకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. అమ్మకాలు తక్కువగా ఉన్న భీమిని, కన్నెపల్లి వైన్స్కు పది చొప్పున రాగా మిగతా చోట్ల జిల్లావ్యాప్తంగా సగటున ఒక్కోషాప్కు 24 చొప్పున వచ్చాయి.
పట్టణాల్లో ఖర్చులెక్కువ
జిల్లా కేంద్రం, పట్టణాల్లో అంతంత మాత్రంగానే వ్యాపారం సాగుతోంది. గ్రామాలతో పోలిస్తే పట్ట ణాల్లో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. రెండేళ్ల పాటు వైన్స్లకు అద్దె, నిర్వహణ, సిబ్బంది జీతాలు అధికంగా మారాయి. అంతేకాక పోలీసు, ఆబ్కారీ, ఇతర అధికార యంత్రాంగానికి నెలనెలా మామూళ్లు ఇవ్వడంతో పాటు, ఇక్కడే పర్యవేక్షణ ఎక్కువగా ఉండడంతో అక్రమాలు చేయడం తక్కు వ. మరోవైపు పట్టణాల్లో బార్లు సైతం ఉండడంతో పోటీ ఎక్కువ. దీంతో వైన్సుల్లో పోటీతో ఓ షాపు ఎమ్మార్పీ ధర కన్నా తక్కువ అమ్మడం మొదలుపెట్టింది. దీంతో మిగతా షాపుల కన్నా కౌంటర్ పెరిగింది. జిల్లా కేంద్రంలోని హమాలివాడ, ప్రధా న రోడ్ల వెంట వైన్స్లు, సిట్టింగ్ సౌకర్యం ఉన్న షా పులకు గిరాకీ బాగానే ఉంటోంది. అయితే పెరిగిన ఖర్చులతో టెండర్ల సమయంలో రూ.లక్షలు పెట్టి షాపు దక్కించుకోవడం, ఆపై లైసెన్స్ ఫీజులు, నిర్వహణ, సిబ్బంది జీతాలు వంటివాటితో గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వచ్చిన ఆదాయం కంటే తక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
బెల్ట్తోనే లాభాల పంట
షాపుల్లో రిటైల్ కంటే హోల్సేల్గా బెల్ట్షాపులు ఉన్న చోట్లనే రెట్టింపు లాభాలు తెస్తున్నాయి. వైన్స్లకు ఎమ్మార్పీపై ఆయా బ్రాండ్లపై ప్రభుత్వం నిర్దేశించిన శ్లాబ్ల ప్రకారమే మార్జిన్ చెల్లిస్తున్నారు. రూ.లక్షల్లో లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. స్టాక్ లిఫ్ట్ చేయండి అంటూ కొన్నిసార్లు అధికారులు అమ్మకాల లక్ష్యం చేరుకునేందుకు కూడా వైన్స్ యజమానులపై ఒత్తిడి తెస్తుంటారు. అయితే కొన్నిసార్లు డిమాండ్ లేని సమయాల్లో విక్రయాలు తక్కువగా ఉంటా యి. వేసవిలో బీర్ల వినియోగం, పెళ్ళిళ్ళు, పండుగలు, ప్రత్యేక దినాల్లో మాత్రం కౌంటర్ సేల్ అధికంగా ఉంటున్నాయి. గతంలో కోల్బెల్ట్ ప్రాంత వైన్స్లు అధికంగా లాభాలు ఇచ్చేవి. అయితే ఒకే ప్రాంతంలో వైన్స్లు పెరగడంతో సిండికేట్గా మారితే తప్ప సింగిల్గా అమ్మితే లాభాలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
ముగిసిన గడువు..
మంచిర్యాలక్రైం: 2025–27 ఆర్థిక సంవత్సరానికిగానూ కొత్త మద్యం పాలసీ అమలుకు జిల్లాలోని 73 మద్యం షాపులకుగానూ ప్రభుత్వం గత నెల 26 నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించింది. 18న బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ నెల 23 వరకు గడువు పొడిగించింది. మొదటిసారి విధించిన గడువు ప్రకారం 1,617 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.48.51 కోట్ల ఆదాయం వచ్చింది. గడువు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య 1,712కు చేరింది. ఐదు రోజుల్లో 80 దరఖాస్తులు పెరిగాయి. ఆదాయం రూ.51.36 కోట్లకు పెరిగింది. ఎక్సైజ్శాఖ అధికారులు జిల్లా మొత్తం మీద ఏషాపులకుఽ తక్కువ దరఖాస్తులు వచ్చా యో ఫోకస్ చేస్తూ మద్యం వ్యాపారులకు ఫోన్లు చేసి మరీ టెండర్లు వేయించే ప్రయత్నాలు చేశారు. ఫీజు గడువు పెంచడంతో గతం కంటే రె ట్టింపు ఆదాయం వస్తుందని అంచనా వేసిన ప్ర భుత్వ వ్యూహం ఫలించక పోవడం గమనార్హం.
27న లక్కీ డ్రా ద్వారా ఎంపిక
ఈ నెల 23న లక్కీ డ్రా నిర్వహించాల్సి ఉండగా టెండర్ల స్వీకరణ గడువు పొడిగించడంతో లక్కీ డ్రా తేదీని కూడా పొడిగించారు. 27న శ్రీరాంపూర్ పోలీస్స్టేషన్ సమీపంలోని పీవీఆర్ గార్డెన్లో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. టెండర్ల గడువు పొడిగించడంతో ఇప్పటి వరకు సిండికేట్ అయిన మద్యం వ్యాపారుల్లో గుబులు మొదలైంది. ముందస్తుగానే అగ్రిమెంట్ ప్రకారం టెండర్లు సమర్పించిన వారు అయోమయంలో పడ్డారు. గడువు పొడిగించడంతో తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం దుకాణాలను చూసి సిండికేట్ అయినవారే తమపంథా మార్చుకుని బినామి పేర్ల మీద మళ్లీ టెండర్లు వేసినట్లు తెలిసింది. జిల్లాలోని భీమిని, కన్నెపెల్లి మండలాల మద్యం దుకాణాలకు రెండంకెలు దాటి దరఖాస్తులు రాకపోవడంతో ఎకై ్సజ్ అధికారులు వాటిపై ఫోకస్ పెట్టి దరఖాస్తులు వేయించినట్లు తెలిసింది.


