
● ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసినవే ● కొన్ని చోట్ల నడపల
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మీ సేవ కేంద్రాల ఏర్పాటు ఉంటుందా? లేదా? అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అవసరమైన చోట్ల తమకు అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నారు. పౌరులకు సులభంగా, వేగంగా ఎలక్ట్రానిక్ సేవలు అందించాలని మీ సేవలు నిర్వహిస్తున్నారు. గత నిబంధనల ప్రకారం కొత్తవి ఏర్పడే అవకాశం ఉండగా, ఇటీవల సవరించిన నిబంధనలతో కొత్త కేంద్రాల ఏర్పాటు అవకాశాల కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ఓఎస్ఎస్(వన్ స్టాప్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్), టీజీటీఎస్(తెలంగాణ టెక్నాలజీ సర్వీస్), తెలంగాణ ఆన్లైన్(టీజీఆన్లైన్) కింద మీ సేవలు సెంటర్లు నడుస్తున్నాయి. ఆయా శాఖల్లోని అధికారిక సేవలన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. పౌరులకు మున్సిపల్ వ్యవసాయ, ఆర్టీఏ, విద్యుత్, పోలీసు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, టీ వాలెట్, దేవాదాయ శాఖలు ఇతర సేవలతోపాటు దాదాపు మూడు వందలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి.
19కేంద్రాలు రద్దు
జిల్లాలో ఉన్న మీ సేవ కేంద్రాలు చాలా వరకు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. రాజకీయ పలుకుబడితో కొందరు దక్కించుకున్నారు. అయితే తర్వాత సరిగా నడపలేక, ప్రస్తుతం 139 మీ సేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో చాలా వరకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నిర్వాహకులకు రెవెన్యూ సంబంధిత ఒక్కో డాక్యుమెంట్కు గరిష్టంగా రూ.12వరకు కమీషన్ వస్తోంది. ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తూ నెట్టుకొస్తునారు. కొన్ని చోట్ల ఆదాయం రాక మూత పడుతున్నాయి. ఇప్పటికే 19కేంద్రాలు రద్దయ్యాయి. జిల్లాలో చివరి సారిగా 2017లో కొత్త కేంద్రాలకు అనుమతి ఇవ్వగా, మరోసారి ఎక్కడెక్కడ అవసరం ఉందో స్థానిక తహసీల్దార్ల నుంచి నివేదిక తీసుకున్నాక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మారిన నిబంధనలు
కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 5వేల జనాభాకు ఒక మీ సేవ ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో 8వేల జనాభా, మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. నిర్వాహకులు డిగ్రీ, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. జిల్లా ఈ గవర్నెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్త మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక చేసి మంజూరు చేస్తారు. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ సొసైటీకి అదనపు కలెక్టర్, సీపీతో సహా కార్మిక, గ్రామీణ, పౌరసరఫరాల, పంచాయతీ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు సభ్యులుగా ఉంటారు.
జిల్లాలో మీ సేవ కేంద్రాలు
ప్రభుత్వ 3
టీజీటీఎస్ 121
టీజీఆన్లైన్ 10
ఓఎస్ఎస్ 5
మొత్తం 139
కొత్తవి వద్దంటున్న నిర్వాహకులు
కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తే తమ అవకాశాలను దెబ్బతిస్తాయని ప్రస్తుత నిర్వాహకుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. హాజీపూర్, లక్సెట్టిపేట, చెన్నూరు మండలాల్లో కొందరు కోర్టుకు వెళ్లడంతో కొత్త కేంద్రాల ఏర్పాటు నిలిచిపోయింది. మరోవైపు సేవ దృక్పథంతో కాకుండా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలు, అధికంగా ఫీజుల వసూళ్ల కారణంగా నిర్వాహకులకు జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల తాండూరులో జరిమానాలు వేశారు. కనీసం రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా, మూడోసారి వరకు తప్పు చేస్తే సెంటర్ రద్దు చేసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి రెవెన్యూ వ్యవహారాల్లో అధికంగా వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

● ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసినవే ● కొన్ని చోట్ల నడపల