
ప్రాజెక్టులో యువకుడి మృతదేహం లభ్యం
తాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వచ్చి గల్లంతైన యువకుడి మృత దేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడ కాలనీకి చెందిన అడ్డెల రఘు(24) తన స్నేహితుడితో కలిసి సరదాగా ప్రాజెక్టు వద్దకు మంగళవారం చేపలు పట్టడానికి వచ్చారు. చేపలు పట్టే క్రమంలో ప్రాజెక్టు గేట్ల సమీపంలో రఘు ఒక్కసారిగా అదుపుతప్పి నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. తన స్నేహితుడు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నీటిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి సోదరుడు అజయ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు.
బాధితుడికి నష్టపరిహారం అందజేత
కాసిపేట: మండలంలోని వెంకటపూర్ గ్రామానికి చెందిన రైతు బుద్దె రాజలింగుకు చెందిన లేగదూడ పెద్దపులి దాడిలో మృతి చెందగా బాధితుడికి అటవీశాఖ ఆధ్వర్యంలో 24గంటల్లో నష్టపరిహారం అందజేశారు. ముత్యంపల్లి సెక్షన్ పరిధి మల్కేపల్లి బీట్లో మంగళవారం పెద్దపులి దాడిలో లేగదూడ మృతి చెందగా బుధవారం బాధిత రైతుకు బెల్లంపల్లి రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి పూర్ణచందర్ రూ. 20వేల నష్టపరిహారం అందజేశారు. డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్నాయక్, ఎఫ్బీవో శ్రీధర్ పాల్గొన్నారు.
కోడి పందేల స్థావరంపై దాడి
జైపూర్: మండలంలోని దుబ్బపల్లి గ్రామ శివారులో బుధవారం కొంతమంది వ్యక్తులు కోడి పందేలు ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు స్థావరంపై దాడి చేశారు. ఎస్సై మాట్లాడుతూ కోడి పందెం ఆడుతున్న సీసీసీ, నస్పూర్కు చెందిన గడ్డం సతీశ్, లక్షెట్టిపేట కుమ్మగూడెంకు చెందిన లశెట్టి సురేశ్, శ్రీరాంపూర్ తీగలపహాడ్కు చెందిన కట్కూరి రాజేశ్లను పట్టుకోగా ఇందారం గ్రామానికి చెందిన కూరగాయల శ్రీకాంత్, యతిరాజు వంశీ, మహేశ్, వైద్య గణేశ్లు, టేకుమట్ల గ్రామానికి చెందిన గోనె శరత్, గోదావరిఖనికి చెందిన పాకి సందీప్, నస్పూర్కు చెందిర రంగు సాయి, అరుణక్కనగర్కు చెందిన ఉదయ్లు పోలీసులను చూసి పారిపోయినట్లుగా తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద ఒక్క కోడి, 31కోడి కత్తులు, రూ.3840లు, మూడు సెల్ ఫోన్లు, ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు.
చెన్నూర్ ఎంఈవోపై విచారణ
చెన్నూర్: మండల విద్యాధికారి కొమ్మెర రాధాకృష్ణమూర్తిపై డీటీఎఫ్ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.లలిత బుధవారం విచారణ చేపట్టారు. ఎంఈవో విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, ఉపాధ్యాయుల సర్వీసు బుక్ రికార్డు పూర్తి చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విచారణ నివేదిక డీఈవోకు నివేదించనున్నట్లు లలిత తెలిపారు.