
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
ఇంద్రవెల్లి: ఈ నెల 9న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు గోడం గణేశ్ కోరారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కుదించి తీసుకువచ్చిన నాలుగు కోడ్లు, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో తొడసం నాగోరావ్, కుమ్ర చంద్రకళ, రఘురాం, అమృత్రావ్, మానిక్రావ్, గేడం భరత్, జుగ్నాక్ భరత్, తదితరులు పాల్గొన్నారు.
కోడలును వేధించిన మామకు ఏడేళ్ల జైలు
ఆసిఫాబాద్: లైంగికంగా కోడలును వేధించిన మామకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30వేలు జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ.రమేశ్ మంగళవారం తీర్పునిచ్చారు. ఈ మేరకు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ వివరాలు వెల్లడించారు. సిర్పూర్(టి) మండలం చీలపెల్లి గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మణ్కు 2015లో హత్య కేసులో కోర్టు 14ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల జైలు జీవితం అనంతరం బెయిల్పై వచ్చాడు. లక్ష్మణ్ భార్య గతంలో చనిపోగా రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య కూడా చనిపోయింది. ఈ క్రమంలో కోడలిని అసభ్య పదజాలంతో దూషిస్తూ లైంగిక వాంఛ తీర్చాలని అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత ఏడాది అక్టోబర్ 7న బాధితురాలి ఫిర్యాదు మేరకు సిర్పూర్(టి)లో కేసు నమోదైంది. ఎస్సై కమలాకర్ కేసు దర్యాప్తు చేశారు. పీపీ జగన్మోహన్రావు, సీడీవో అండ్ లైజనింగ్ ఆఫీసర్ రాంసింగ్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ రమేశ్, ఎస్సై కమలాకర్, సీడీవో బాలాజీని ఎస్పీ అభినందించారు.
పులి దాడిలో లేగదూడ హతం
కాసిపేట: మండలంలోని వెంకటాపూర్ శివారు అటవీప్రాంతంలో పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి చెందింది. బెల్లంపల్లి అటవి రేంజ్ అధికారి పూర్ణచందర్ తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం మండలంలోని వెంకటపూర్కు చెందిన రైతు బుద్దె రాజలింగు తన లేగ దూడ పులి దాడిలో మృతి చెందిందని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సమీపంలో కుంట వద్ద పెద్దపులి అడుగులు ఉన్నట్లు గుర్తించారు. పెద్దపులి సంచరిస్తున్నందువల్ల వెంకటాపూర్, లక్ష్మీపూర్, మల్కేపల్లి, సోనాపూర్ గ్రామాల ప్రజలు పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పశువుల కాపారులు అడవిలోకి వెళ్లవద్దన్నారు. బాధిత రైతుకు నష్టపరిహారం అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి యువకుడి గల్లంతు
తాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్కు చెందిన అడేల్ల రఘు తన మిత్రుడు శ్రావణ్తో కలిసి చేపలు పట్టడానికి ప్రాజెక్టు వద్దకు వచ్చాడు. ప్రాజెక్టు దిగువ భాగంలో చేపలు పడుతుండగా లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక నీటిలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జాలర్లతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు.

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి