
ఆక్రమణలు.. అపరిశుభ్రత
● వర్షాలు పడితే వరద నీరు పారడం కష్టమే ● డ్రెయినేజీల్లోనూ నిండిన పూడిక ● రోడ్లపై పారుతున్న మురుగునీరు
మంచిర్యాలటౌన్: పేరుకే జిల్లా కేంద్రం.. ప్రతియేటా వర్షాకాలంలో నగరంలోని కొన్ని కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంటోంది. నగరాన్ని ఆనుకుని రాళ్లవాగు, తోళ్లవాగులు ప్రవహిస్తుండగా.. ఈ నీరు నేరుగా వెళ్లి గోదావరినదిలో కలుస్తుంది. డ్రెయినేజీల ద్వారా వెళ్లే నీరు వాగుల్లోకి చేరి అక్కడి నుంచి గోదావరిలో కలుస్తుండడం, ప్రతియేటా వర్షాకాలంలో వరద నీరు వాగుల ద్వారా వెనక్కి వచ్చి పలు కాలనీలు నీటమునగడం జరుగుతోంది. సాధారణ వర్షాలకే వరద నీరు నిండి డ్రెయినేజీల నుంచి బయట రోడ్లపై చేరుతోంది. హైటెక్సిటీ కాలనీలోని డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో కాలంతో సంబంధం లేకుండా మురుగునీరు రోడ్లపై పారుతోంది. వర్షాకాలంలో వరద నీరు తోడై నడవలేని పరిస్థితి ఎదురవుతోంది. రామునిచెరువు మత్తడి కాలువ ద్వారా చెరువునీటితోపాటు స్థానికంగా డ్రెయినేజీ నీరు ఈ కాలువ ద్వారానే వెళ్లి రాళ్లవాగులో కలుస్తుంది. మత్తడి కాలువలో పిల్లర్లు వేసి స్లాబ్ వేయడం వల్ల మురుగు నీరు పారేందుకు అడ్డుగా మారుతోంది. గతంలో స్లాబ్లను కార్పొరేషన్ అధికారులు తొలగించగా మళ్లీ వేస్తుండడంతో వరద నీరు పారడం కష్టమే. కాలువ ఉప్పొంగి పక్కనే ఉన్న ఇస్లాంపుర కాలనీకి వరద ముప్పు ఏటా పొంచి ఉంటుంది. పట్టణంలోని రాంనగర్, రెడ్డికాలనీ, ఎన్టీఆర్నగర్, పద్మశాలికాలనీ, ఆదిత్య ఎంక్లేవ్, బృందావనం కాలనీ, సూర్యనగర్ కాలనీలు చిన్నపాటి వర్షానికే వరద నీరు చేరి ముంపుగా మారుతున్నాయి. వర్షాకాలానికి ముందే డ్రెయినేజీల్లోని చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించాల్సి ఉండగా ఇప్పటికీ చేపట్టలేదు. ఈ కారణంగా కూడా డ్రెయినేజీల్లోని మురుగునీరు రోడ్లపైకి పారుతోంది.

ఆక్రమణలు.. అపరిశుభ్రత

ఆక్రమణలు.. అపరిశుభ్రత

ఆక్రమణలు.. అపరిశుభ్రత