
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. పడమర దిశగా ఈదురుగాలులు వీస్తాయి.
పూడిక నిండి.. పిచ్చిమొక్కలు పెరిగి..
బెల్లంపల్లి: బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీలో మౌలిక సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 34 వార్డుల్లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. శివారు వార్డులు తీవ్ర నిరాదరణకు గురవుతుండగా.. అన్ని వార్డుల్లో సమస్యలు తిష్ట వేసి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. వర్షాకాలంలో మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయి. గంగారాంనగర్, కాల్టెక్స్ ఏరియా, షంషీర్నగర్, అంబేడ్కర్ నగర్, హన్మాన్బస్తీ, కన్నాల బస్తీ, మధునన్ననగర్, అశోక్నగర్, రైల్వేరడగంబాల బస్తీ, సుభాష్నగర్, గోల్బంగ్లాబస్తీ, శాంతిఖని, బెల్లంపల్లి బస్తీ తదితర ప్రాంతాల్లో మురికి నీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని వీధుల్లో మురికి కాలువల్లో పూడిక నిండి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. మరికొన్ని చోట్ల నేటికీ మురికి కాలువల నిర్మాణం చేపట్టలేదు. సగానికిపైగా జనావాసాలను ఆనుకుని మురికి నీరు గుంతల్లో స్థిరంగా నిలిచి ఉండడంతో దోమలు వృద్ధి చెందాయి. బూడిదగడ్డ బస్తీ నుంచి అశోక్నగర్ మీదుగా ప్రవహించే వాగు నుంచి వచ్చే వరద నీరు వెళ్లిపోవడానికి డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. చెదిరిన, గుంతలు పడిన రోడ్లపై రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా తయారయ్యాయి. హన్మాన్బస్తీ–రాంనగర్ బస్తీ మధ్య వాగుపై లోలెవల్ వంతెన ఏటా వర్షాకాలంలో వరద నీటిలో మునిగి రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.
ఇళ్లలోకి వరద నీళ్లు
మురికి కాలువ కట్టాలని ఎన్నో ఏళ్ల సంది వేడుకుంటున్నం. గెల్సినోళ్లు, అధికారులు మాటిచ్చి పట్టించుకుంట లేరు. గట్ల జేయబట్టి వరద నీరంతా కాలువ నిండా ప్రవహించి ఇండ్లల్లకత్తన్నయ్. నీళ్లు రాబట్టి పొయినేడు మా ఇంటి గోడ కూలిపోయింది. మళ్లా కట్టిచ్చినం. ఎవలకు ఎన్నిసార్లు జెప్పినా సరే అని అంటండ్లు కానీ చెవిన పెడ్తలేరు. ఈసారైనా మురికి కాలువ కట్టిచ్చి నీళ్లు ఇండ్లల్లకు రాకుండా చర్యలు తీసుకోవాలే.
– లింగాల రాములు, అశోక్నగర్

వాతావరణం