అగ్గి.. రాజుకుంటే బుగ్గే | - | Sakshi
Sakshi News home page

అగ్గి.. రాజుకుంటే బుగ్గే

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

సకాలంలో చేరుకుంటేనే..

దూరభారంతో నష్టం..

ఫైర్‌ ఇంజిన్లు.. బుల్లెట్లు

మహబూబ్‌నగర్‌ క్రైం: వేసవికాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యంలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్‌ ఇంజిన్లు సంఘటనా స్థలాలకు చేరుకొని ఎంతో కొంత వరకు మంటలు అదుపులోకి తెస్తున్నాయి. కానీ, కొన్ని ఫైర్‌స్టేషన్ల దగ్గర ఫైర్‌ ఇంజిన్ల పరిధి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో కొన్ని రోడ్లు సైతం అస్తవ్యస్తంగా ఉండడంతో సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి 50 వేల జనాభా కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్‌ ఇంజిన్‌ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 80 ఫైర్‌ ఇంజిన్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 17 ఫైర్‌ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు.

మ్మడి జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. రెండు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయి. ఇందులో మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, కొత్తకోట, నారాయణపేట, మక్తల్‌, గద్వాల, అలంపూర్‌, వనపర్తి, ఆత్మకూర్‌, కొత్తకోట, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌, అచ్చంపేట, అమ్రాబాద్‌లో అవుట్‌పోస్టు కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఫైర్‌ ఇంజిన్‌, ఒక బుల్లెట్‌ ఉండగా మహబూబ్‌నగర్‌లో మాత్రం 10 వేల లీటర్లతో ఒకటి, 4,500 లీటర్లు, 2,300 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఫైర్‌ ఇంజిన్లతోపాటు బుల్లెట్స్‌ సైతం అందుబాటులో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐదు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఐదు, గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క టి మాత్రమే ఉంది. అలంపూర్‌ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.

అగ్ని ప్రమాదాలు

112

జిల్లా ఫైర్‌స్టేషన్లు వాహనాలు

మహబూబ్‌నగర్‌ 2 5

నారాయణపేట 2 2

గద్వాల 2 2

నాగర్‌కర్నూల్‌ 4 5

వనపర్తి 3 3

ఉమ్మడి జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదాలు

13 స్టేషన్ల పరిధిలో

17 ఫైర్‌ ఇంజిన్లు మాత్రమే..

పలు ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు

ఘటనా స్థలానికి చేరుకోవడంలో

ఆలస్యంతో తీవ్రనష్టం

కొత్త కేంద్రాల ఏర్పాటుపై

కొరవడిన చిత్తశుద్ధి

వేసవిలో తరచూ ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. భానుడి భగభగకు గడ్డివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, జిన్నింగ్‌ మిల్లులు, వాహనాలు కాలిపోతుంటాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంటుంది. ప్రమాదాల కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతుంటాయి. ఏటా ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖది కీలక పాత్ర. వీరు సకాలంలో వస్తేనే ఆస్తినష్టం జరగకుండా కాపాడుకోవచ్చు.

ఉమ్మడి పాలమూరులో 64 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాల విస్తీర్ణం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్‌ స్టేషన్‌ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు అచ్చంపేట ఫైర్‌ స్టేషన్‌లో ఉన్న ఫైర్‌ ఇంజిన్‌ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా అంతంతే. ఈ లెక్కన ఫైర్‌ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఫైర్‌ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినా ఏర్పాటు చేయడంలో అటు అధికారుల్లో, ఇటు ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కొరవడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement