48 డిగ్రీలకు చేరుకుంటే..
పాలమూరుపై భానుడి ప్రతాపం
● ఉదయం 8 గంటల నుంచే
అధికమవుతున్న ఎండలు
● ఉక్కపోతతో చిన్నారులు,
బాలింతలు, వృద్ధుల ఇక్కట్లు
పాలమూరు: ఎవరి నోటా చూసినా ఇవేం ఎండలురా బాబు.. మాడు పగిలిపోతుందనే మాటే వినిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే మొదలై 12 గంటలు చేరుకోకముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయట రోడ్లమీదకు రావాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి కనిపింస్తోంది. చిన్నారులు మధ్యాహ్నం పాఠశాలల నుంచి తిరిగి ఇళ్లకు చేరుకునేలోపు అవస్థలు పడుతున్నారు. చాలామంది వేడివల్ల వడదెబ్బకు గురవుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూత్పూర్ మండల పరిధిలో 42 డిగ్రీల వరకు నమోదు కాగా మహబూబ్నగర్ అర్బన్, రూరల్లో 41, కోయిలకొండలో 40 డిగ్రీల వరకు నమోదు కావడం విశేషం.
ఎండలు, వడగాలులు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మన శరీర ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ (98.6 డిగ్రీల పారన్హీట్) కలిగి ఉంటుంది. వేసవిలో మరో పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఎండలో ఉంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎండ తీవ్రత పెరిగే కొద్ది మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చెమట పట్టడంతో ఒత్తిడి, చికాకు అధికం అవుతుంది. రక్తప్రసరణ పెంచడానికి గుండె వేగం పుంజుకుంటుంది. పెద్దలు రోజుకు ఐదు లీటర్ల నీటిని తాగాలి. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు ఎక్కువ సమయంలో ఎండలో ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం అధికంగా ఉంటుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది.
వేసవిలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకుంటే వైద్యపరంగా అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. నవజాత శిశువుల విషయంలో తల్లిదండ్రులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నవజాత శిశువులకు తల్లిపాలు ఎక్కువసార్లు తాగించాలి. నవజాత శిశువులు ఉండే గదిలో చల్లని వాతావారణం ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటి బయట ఆడకుండా జాగ్రత్త వహించాలి. ఎండలో బయటకు వెళ్లడం తప్పనిసరైతే గొడుగు తీసుకువెళ్లాలి. వడదెబ్బ తగిలితే తలనొప్పి, వాంతులు, జ్వరం వస్తాయి. వడదెబ్బ ప్రభావ ం ముందుగా మెదడు, గుండె, మూత్రపిండాలపై పడుతుంది. అపస్మారక స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి. జ్వరం తీవ్రత అధికంగా ఉంటే మరీ చల్లని నీటితో కాకుండా మాములు నీటితో ముంచిన గుడ్డతో శరీరాన్ని తుడవాలి. పిల్లలకు వడదెబ్బ తగలకుండా తరచూ మంచినీరు, కొబ్బరినీళ్లు వాడటం మంచిది. సులభంగా జీర్ణమమ్యే తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం.


