అలంపూర్: గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తేనే అధిక లాభాలు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పలు సూచనలు, సలహాలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. గొర్రెలలో వచ్చే రోగాల నివారణకు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని పశుసంవర్థక శాఖ అధికారి శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను వివరించారు.
● అనేక మంది సన్నకారు చిన్నకారు, రైతులు, వ్యవసాయ కూలీలు గొర్రెలను అధిక సంఖ్యలో పెంచడం జరుగుతుంది. అయితే వీటి పోషణలో తగు జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రతి ఏడాది 20 శాతం వరకు గొర్రెలను కోల్పోతున్నారు. దీంతో అనేక మంది గొర్రెల పెంపకందార్లు లాభాలకు బదులుగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
●గొర్రెల పోషణలో ఆధునిక యాజమాన పద్ధతులు, ఆరోగ్య రక్షణ మీద సరైన అవగాహన పెంచుకుంటే లాభాలు ఆర్జించవచ్చని ఆయన పేర్కొంటున్నారు.
పెంపకంలో సలహాలు
ప్రధానంగా గొర్రెల పాకలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాకలను గాలి, వెలుతురు వచ్చే విధంగా ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. పాకలో తడి లేకుండా చూసుకోవాలి.
● గొర్రెలకు సరైన కాలంలో టీకాలు ఇప్పించాలి. అమ్మతల్లి, పీపీఆర్ వంటి రోగాల నివారణకు టీకాలు చేయించాలి.
● గొర్రెలకు క్రమం తప్పకుండా 60 నుంచి 90 రోజులకు ఒక సారి నట్టల నివారణ మందులు త్రాగించాలి. ఈ మందులను పశు వైద్యుల సలహా మేరకు అందించాల్సి ఉంటుంది.
● గొర్రెల పోషణలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో గొర్రెల పిల్లలు నూటికి 20 వరకు మృతి చెందడం జరుగుతుంది. గొర్రె పిల్లల మరణాలు అరికట్టాలి. గొర్రె పిల్లలకు పుట్టిన మూడోరోజు జున్నపాలు తాపాలి. పశు వైద్యుల సలహా మేరకు రోగ నిరోధక మందులను నోటి ద్వార అందించాలి.
పాడి–పంట
నీటి ప్రవాహాల వద్దనే నీటిని తాపాలి
గొర్రెల మందలో విత్తనపు పొటెళ్లను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి. మందలో వచ్చే వ్యాధులను అప్రమత్తంగా ఉంటు గమనించుకోవాలి. అలాంటి వ్యాధి లక్షణాలు ఉన్న గొర్రెలను మంద నుంచి వేరు చేసి సరైన చికిత్స అందించాలి. దోమలు, ఈగల వలన కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటి నివారణకు వర్షాకాలం, శీతాకాలల్లో గొర్రెల మందలో వేపాకు పొగను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా గొర్రెల పెంపకంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే గొర్రెల మరణాలు తగ్గించి అధిక లాభాలు పొంద వచ్చని సూచించారు.


