
అప్రమత్తతే శ్రీరామ రక్ష
● హానికర బాణాసంచాకు
దూరంగా ఉండాలి
● చిన్నారులతో జాగ్రత్త
● పర్యావరణ హితమే మేలు
మహబూబ్నగర్ క్రైం: వెలుగు పూలు పూయించే దీపాల పండగ దీపావళి కొందరికీ సంతోషాన్ని.. మరికొందరికి అనారోగ్యాన్ని మోసుకొస్తోంది. ఆనందం కోసం కాల్చే టపాసులు పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ప్రాణికోటి మనుగడకే ముప్పు తెస్తున్నాయి. ఇదే సమయంలో మోతల మాటున శబ్ద కాలుష్యం, వెలుగుల మాటున రసాయన కాలుష్యం వెదజల్లుతూ ప్రకృతికి హాని కల్గిస్తోందన్న వాదన ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణీత సమయం వరకు టపాసులు కాల్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎక్కువ శబ్దలు వింటే..
టపాసులు కాల్చే సమయంలో ఎంతో ఆనందిస్తాం. కానీ అవి విడుదల చేసే వాయువులు, దుమ్ము, శబ్దాలు ఎంతో మందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. వాతావారణం పూర్తిగా నాశనం అవుతుంది. ఎక్కువ శబ్దం వచ్చే టపాసులు కాల్చడం వల్ల చెవులకు హని కలిగే ప్రమాదం ఉంది. మనిషి సాధారణంగా వినే శబ్దాల తీవ్రత 60 నుంచి 65 డెసిబుల్స్ మధ్య ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీవ్రత కల్గిన శబ్దాల వల్ల మనిషి వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిసస్తునన్నారు.
గాలిలో కలుస్తున్న దుమ్ము కణాలు
దీపావళి పండగ సందర్భంగా వారం రోజుల పాటు కాల్చే టపాసుల కారణంగా శబ్దాలే కాకుండా పొగ, దుమ్ము, దూళి గాలిలో పెద్ద మొత్తంలో కలుస్తాయి. నేల మీద టపాసులు పేలినప్పుడు ఆ శబ్దాల తీవ్రతకు దుమ్ము ఒక్కసారిగా పెద్ద మొత్తంలో గాలిలోకి చేరుతుంది. మహబూబ్నగర్ పట్టణంలో సాధారణ రోజులల్లో రోడ్లపై దుమ్ము కణాలు 30 నుంచి 35 ఆర్ఎస్పీఎం (రెస్పిరబుల్ సస్పెండబుల్ పార్టిక్యులేట్ మ్యాటర్) శాతంగా ఉంటాయి. అదే దీపావళి రోజు 52శాతం వరకు చేరుతున్నట్లు సమాచారం. గాలిలో 50 శాతం దుమ్ము కణాలు ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు.
ఆరోగ్యంతో జాగ్రత్త
వినలేని శబ్దాలను అదే పనిగా వింటూ ఉండటం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. రక్తపోటు, గుండె జబ్బులు ఉన్న వారి ఆరోగ్యానికి ఇలాంటి శబ్దాలు మరింత ప్రమాదకరం. ముఖ్యంగా పెద్ద శబ్దాలు వినడం వల్ల తలనొప్పి, రక్తపోటు, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మైగ్రేన్తో బాధపడేవారికి శబ్దాలు వింటే రెండు గంటల పాటు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. శబ్ద ప్రభావం పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
ఇలా చేస్తే ఇబ్బంది ఉండదు
టపాసులు కాల్చే సమయంలో వచ్చే పొగ ఎక్కువగా మనుషులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ముక్కు, నోటికి మాస్క్, చెవుల్లో దూది లాంటివి పెట్టుకోవడం మేలు. టపాసుల నుంచి వచ్చే కా లుష్యం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాటన్ దుస్తులు ధరించాలి.
దగ్గర ఉండి కాల్చకండి..
దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చడానికి రూ.వేలు ఖర్చు చేసి అధిక స్థాయిలో టపాసులు కొనుగోలు చేస్తారు. వాటిని దగ్గర నుంచి కాల్చడం వల్ల 91 డెసిబుల్స్ తీవ్రత గల శబ్దాలను స్పష్టంగా వినిపిస్తాయి. 100 డెసి బు ల్స్ తీవ్రత గల శబ్దాలను 15 నిమిషాల వరకు.. 112 డెసిబుల్స్ శబ్దాలను ఒక నిమిషం పాటు వినగలం. 140 డెసిబుల్స్ శబ్దం మనుషులు వింటే వినికిడి శక్తి కొంత మేరకు కోల్పోవడానికి అవకాశం ఉంది. తీవ్రమైన శబ్దం వచ్చే బాణాసంచా 140 నుంచి 150 డీబీ శబ్ద తీవ్రత విడుదల చేసే ప్రమాదం ఉంది.
శబ్ధాలతో ప్రమాదం
టపాసులు కాల్చుతున్న సమయంలో అతి ధ్వనులనిచ్చే వాటికి దూరంగా ఉండాలి. భారీ శబ్దాల కారణంగా కర్ణభేరి పగిలి కొన్నిసార్లు వినికిడి శక్తి కోల్పోవాల్సి వస్తోంది. దీపావళి సమయంలో ఇలాంటి వారు చాలా మంది చికిత్స కోసం వస్తుంటారు. బాణాసంచా నుంచి వెలువడే హనికర రసాయనాల ద్వారా పొగతో ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
– డాక్టర్ సందీప్కుమార్, పల్మానాలజిస్ట్