ఏసీబీ అధికారుల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ అధికారుల హల్‌చల్‌

Jun 28 2025 6:01 AM | Updated on Jun 28 2025 8:48 AM

ఏసీబీ

ఏసీబీ అధికారుల హల్‌చల్‌

అచ్చంపేట: స్థానిక బీసీ ప్రభుత్వ వసతిగృహాన్ని శుక్రవారం మహబూబ్‌నగర్‌ రేంజ్‌ డీఎస్పీ సీహెచ్‌ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆహార భద్రత, ఆరోగ్య, తూనికలు కొలతలు, విద్యుత్‌ శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 7 వరకు హాస్టల్‌కు చేరుకున్న అధికారులు వార్డెన్‌ జనార్దన్‌ లేకపోవడంతో 10 గంటల వరకు నిరీక్షించారు. వార్డెన్‌, పదోన్నతిపై వెళ్లిన వార్డెన్‌ శ్రీరామ్‌ వచ్చిన అనంతరం ఆయా శాఖల అధికారులు కార్యాలయంలోని 18 రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన మెనూ, అరటి పండ్లు, సబ్బులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పలువురు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు, భవనం పరిస్థితిని చూశారు. ఏసీబీ తనిఖీల సమాచారం క్షణాల్లో ప్రచారం కావడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఏ కార్యాలయంపై దాడులు చేస్తారన్న భయంతో వణికిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తమై భయం, భయంగా విధులు నిర్వర్తించారు. ఈ నెల 25న కల్వకుర్తి ఎస్‌ఐ–2 ఎం.రాంచందర్‌జీ ఏసీబీకి పట్టుబడటం, మూడు రోజుల వ్యవధిలోనే అచ్చంపేటలో ఏసీబీ అధికారులు తనిఖీ చేపట్టడం చర్చనీయాంశమైంది.

ప్రభుత్వానికి నివేదిస్తాం..

రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వసతిగృహాల్లో ప్రభుత్వం ప్రకటించిన మెనూ అమలు, ఇతర సౌకర్యాలు పరిశీలించేందుకే తనిఖీలు చేపట్టామని ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ బాలకృష్ణ తెలిపారు. హాస్టల్‌లో విద్యార్థుల నమోదు, ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య వివరాలను పరిశీలించినట్లు చెప్పారు. లోకల్‌, నాన్‌ లోకల్‌ విద్యార్థుల వివరాలు, హాస్టల్‌ భవనం పరిస్థితి, సౌకర్యాలు పరిశీలించామన్నారు. హాస్టల్‌ పరిసరాల పరిశుభ్రత, ఇతర సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ప్రతి హాస్టల్‌లో 18 రకాల రికార్డులను నిర్వహిస్తారని.. వాటి ఆధారంగా గుర్తించిన అంశాలను సరి పోల్చుకొని పూర్తి వివరాల నివేదికను ఏసీబీ డీజీకి అందజేస్తామని చెప్పారు. డిటేల్‌ రిపోర్టు ప్రభుత్వానికి పంపించిన తర్వాత సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫారస్‌ చేస్తారన్నారు. తనిఖీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలిమా, తూనికలు, కొలతల అధికారి ప్రవీణ్‌కుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వజ్రకుమార్‌రెడ్డి, ఏసీబీ సీఐలు ఎస్‌కేఏ జిలానీ, పి.లింగస్వామి, ట్రాన్స్‌కో ఏఈ రామకృష్ణ, వార్డెన్లు శ్రీరామ్‌, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

అచ్చంపేట బీసీ హాస్టల్‌లో రికార్డులు, పరిసరాల పరిశీలన

ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందిస్తామన్న డీఎస్పీ

ఏసీబీ అధికారుల హల్‌చల్‌ 1
1/1

ఏసీబీ అధికారుల హల్‌చల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement