బీఆర్‌ఎస్‌ నేతల మాటలు అర్థరహితం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేతల మాటలు అర్థరహితం

Jun 28 2025 8:47 AM | Updated on Jun 28 2025 8:47 AM

బీఆర్‌ఎస్‌ నేతల మాటలు అర్థరహితం

బీఆర్‌ఎస్‌ నేతల మాటలు అర్థరహితం

నారాయణపేట: జూరాల డ్యాంపై బీఆర్‌ఎస్‌ నేతల మాటలు అర్థరహితమని.. సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు గారికి నీళ్లు ఇవ్వాలనే జూరాల నుంచి దిగువకు నీటిని వదులుతున్నారని అనడం ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమ, క్రీడాశాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్‌లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాం నుంచి నీరు వదిలితేనే జూరాలకు వస్తాయని.. ఇక్కడి నుంచి దిగువకు వదలడం మామూలేనని అన్నారు. దీనిపై బీఆర్‌ఎస్‌ నేతలు లేనిపోని విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 95 శాతం పూర్తయిందని.. మోటారు ఆన్‌చేస్తే నీరు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోటరు ఆన్‌చేసి నీరు ఏ కాల్వలో వదలాలో చెప్పాలన్నారు. మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే రాజకీయ జీవితానికి జీవం పోసిందే కాంగ్రెస్‌ పార్టీ అని.. అధికారంలో లేకపోయినా అధికారం చెలాయించారని మంత్రి అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు లేనిపోని విమర్శలు చేస్తే సహించమన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సంగంబండ రిజర్వాయర్‌ వద్ద ఉన్న ఒక బండను పగులగొట్టేందుకు చేతకాలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యే అయిన మూడు నెలల్లోనే రూ. 12కోట్ల నిధులు తీసుకొచ్చి రిజర్వాయర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు రైతులకు పరిహారం అందించినట్లు తెలిపారు. దాదాపు 5,600 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమదేనని అన్నారు. జూరాల డ్యాం భద్రత, అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. బీఆర్‌ఎస్‌ నేతలు డేట్‌, టైం, ప్లేస్‌ డిసైడ్‌ చేయాలని మంత్రి సవాల్‌ విసిరారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గణేశ్‌, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ఎల్కోటి నారాయణరెడ్డి, కోళ్ల వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

జూరాల డ్యాం భద్రత, అభివృద్ధిపై చర్చకు సిద్ధం: మంత్రి వాకిటి శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement