
మెనూ ప్రకారం ఎందుకు ఇవ్వడం లేదు?
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘మెనూ ప్రకారం వైద్య విద్యార్థులకు భోజనం ఎందుకు వడ్డించడం లేదు? వంట గదిలోని వివిధ పరికరాలను వినియోగించుకోవడంలో ఇబ్బందులేమిటి?’ అంటూ మెడికల్ కళాశాలలో మెస్ నిర్వాహకులను కలెక్టర్ విజయేందిర బోయి, రాష్ట్ర మెడికల్ మానిటరింగ్ కమిటీ (ఎంఎంసీ) హెచ్ఓడీ వనం వెంకటేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం వీరు ఎదిర శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, స్థానిక జీజీహెచ్ ఆవరణలోని ఎంసీహెచ్, కొత్తబస్టాండుకు ఎదురుగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన సముదాయాలను తనిఖీ చేశారు. ముందుగా మెడికల్ కళాశాలలో అకాడమిక్–అమిషన్, లెక్చరర్ హాల్, విద్యార్థుల తరగతి గదులు, స్కిల్, హెమటాలజీ, క్లినికల్, పీజీ రీసెర్చ్ ల్యాబ్స్, సైకాలజీ విభాగం, డిసెక్షన్ హాల్–మ్యూజియం ఇలా అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భవన ప్రాంగణంలోని ఆయా అంతస్తుల కారిడార్లో పవర్ కేబుల్ ఏర్పాటు లోపభూయిష్టంగా ఉందన్నారు. ఈ ప్రాంతం నగరానికి శివారులో గుట్టల మధ్య ఉన్నందున వివిధ పక్షులు వచ్చి వాటిలో ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పవర్ కేబుల్ కనిపించకుండా వెంటనే సరి చేయాలని, ముఖ్యంగా హౌస్ కీపింగ్పై దృష్టి సారించాలన్నారు. అలాగే బాలురు, బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంట గదుల్లో వెలుతురు సరిలేకపోవడంపై మండిపడ్డారు. అలాగే విలువైన కొన్ని పరికరాలను ఎందుకు ఉపయోగించడం లేదని అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనశాలలో తయారు చేసిన వంటకాలను పరిశీలించారు. వైద్య విద్యార్థులకు కేవలం సాంబార్, టమాటా కర్రీ మాత్రమే వడ్డించడమేమిటని, ఇతర కూరగాయలు, ఆకుకూరలు ఎందుకు వండలేదని ప్రశ్నించారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ మెనూలో పేర్కొన్న విధంగా అన్ని రకాల ఐటమ్స్ తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. అంతకుముందు మెడికల్ కళాశాల డైరెక్టర్ డా.రమేష్తో కలిసి ఆయా విభాగాల హెచ్ఓడీలతో 44 అంశాలపై సమీక్షించారు. కాగా, మౌలిక సదుపాయాలు కల్పించాలని, బోధన సిబ్బంది (ఫ్యాకల్టీ)ని నియమించాలని డైరెక్టర్ డా.రమేష్ విన్నవించారు. అనంతరం జీజీహెచ్ ఆవరణలోని మాతా శిశు సంరక్షణ విభాగం (ఎంసీహెచ్)లో లేబర్ రూం, చిన్నపిల్లల వార్డును, కొత్త బస్టాండు వద్ద అధునాతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో టీజీఎంఐడీసీ ఈఈ రవిచంద్ర, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శశికాంత్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఎంసీ మార్గదర్శకాలు పాటించాలి
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకనుగుణంగా పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని ఎంఎంసీ హెచ్ఓడీ వాసం వెంకటేశ్వర్రెడ్డి ఇక్కడి వైద్యాధికారులకు సూచించారు. ఇంకా ఏయే సదుపాయాలు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరమో గుర్తించి సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తేవాలన్నారు. ఆ మేరకు సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వానికి ఈనెల 30న ప్రతిపాదనలు అందజేస్తామన్నారు.
విద్యార్థులకు భోజనం వడ్డించేది ఇలాగేనా..!
వంట గదిలోని పరికరాలకు వినియోగించాల్సిందే
వెలుతురు సరిగా లేకపోవడంపై కలెక్టర్, రాష్ట్ర ఎంఎంసీ హెచ్ఓడీ అసంతృప్తి
మెడికల్ కళాశాల భవనంలో పవర్ కేబుల్ ఏర్పాటులో లోపాలు