
డ్రగ్స్ కట్టడికి అందరూ సహకరించాలి
పాలమూరు: విద్యార్థి దశలో ఉన్న యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్శాఖ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా స్టేడియం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి పాపిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్ వినియోగం అరికట్టేందుకు పోలీస్శాఖకు, ఇతర యంత్రాంగానికి సహకరించాలన్నారు. ఇలా ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా నిత్యం డ్రగ్స్పై నిఘా పెట్టాలని సూచించారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల బారినపడి జీవితాలు, భవిష్యత్ నాశనం చేసుకోరాదని సూచించారు. పోలీస్ శాఖ, ఎకై ్సజ్ శాఖలు పూర్తి సమన్వయంతో డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే కళాశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారని, డ్రగ్స్ రవాణాపై ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 100, 1908 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ డ్రగ్స్ కట్టడికి పోలీస్ శాఖ నిత్యం పోరాటం చేస్తోందని, యువత సైతం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలన్నారు. అంతకుముందు స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను అధికారులు తిలకించారు. అలాగే ‘సే నో టూ డ్రగ్స్– ఎస్ టు లైఫ్’ అనే ప్రతిజ్ఞ బోర్డుపై అందరూ సంతకాలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, మహిలా శిశు సంక్షేమ శాఖ అధికారిని జరీనా, న్యాయమూర్తి ఇందిర, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, డీఈఓ ప్రవీణ్కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా స్టేడియం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ
హాజరైన జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ