
వార్డు ఆఫీసర్లదే కీలక పాత్ర
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వార్డు ఆఫీసర్లదే కీలక పాత్ర అని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్చర్ల, భూత్పూర్, పాలమూరు వార్డు ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, రేషన్కార్డుల వంటి వాటివి తామే పరిశీలించాలన్నారు. వర్షాకాలం ఆరంభమవుతున్నందున నగరంతో పాటు ఆయా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రోడ్లు, కాల్వల్లో చాలా చోట్ల చెత్త, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలతో నిండిపోతున్నాయని పేర్కొన్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా తాగునీటి సమస్య, సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలన్నారు. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, పాఠశాల భవనాలు గుర్తించాలన్నారు. ఎక్కడైనా అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపడితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలన్నారు. కొత్త ఇళ్ల నిర్మాణంలో కొంత భాగం ఖాళీగా ఉంచాలని, అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు చుట్టూ తిరిగేలా, బాధితులను తరలించేందుకు అంబులెన్స్ సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే విషయంపై యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఆస్తిపన్ను, నల్లా బిల్లులు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. పార్కులు పచ్చదనంతో ఉట్టిపడేలా కృషి చేయాలన్నారు. వంద రోజుల ప్రత్యేక కార్యారణకు అందరూ సిద్ధం కావాలన్నారు. ఫ్రై డే.. డ్రై డే వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇక ప్రతి వార్డులో వార్డు ఆఫీసర్లకు ఒక కార్యాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అందులో వారికి అవసరమయ్యే సామగ్రిని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మహబూబ్నగర్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు లక్ష్మారెడ్డి, నూరుల్ అహ్మద్తో పాటు ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు2న మంజూరు పత్రాలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందజేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించారు. స్థానిక పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. మంజూరు చేసిన యూనిట్ల స్థాపన అనంతరం వాటి పనితీరు, నిర్వహణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు జిల్లాలో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 29, 30 తేదీలలో జరిగే ఇన్చార్జి మంత్రుల సమావేశంలో రాజీవ్ యువ వికాసంపై చర్చించి తుది జాబితా ఆమోదం చేయాలన్నారు. వీసీలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈడీ వెంకటరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి, వెనుకబడిన తరగతులు అభివృద్ధి అధికారిణి ఇందిర, ఎల్డీఎం భాస్కర్ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ విజయేందిర బోయి